Tuesday, September 7, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౧(331)

( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-680-క.
నరవరుల దూతయును ముర
హరుచే నభయప్రదాన మంది ధరిత్రీ
వరులకడ కేగి పద్మో
దరు వచనము సెప్పి సమ్మదంబునఁ దేల్చెన్.
10.2-681-వ.
అంతఁ గృష్ణుండు నిజకాంతాతనయ బంధు సుహృజ్జన సమేతుండై కదలి చనునెడ.
10.2-682-చ.
కటపటరత్నకంబళనికాయకుటీరము లుల్లసిల్ల ను
త్కటపటుచామరధ్వజ పతాక కిరీట సితాతపత్త్ర వి
స్ఫుట ఘనహేతిదీధితి నభోమణిఁ గప్పఁగఁ దూర్యఘోషముల్‌
చటులతిమింగిలోర్మిరవసాగరఘోషము నాక్రమింపఁగన్. 

భావము:
బంధీలుగా ఉన్న రాజుల దూతగా వచ్చిన బ్రాహ్మణుడు కూడ శ్రీకృష్ణునిచే అభయప్రధానం అందుకుని, తిరిగి ఆ రాజుల వద్దకు వెళ్ళి వాసుదేవుడి వచనాలు వారికి వినిపించి వారిని సంతోష పెట్టాడు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు తన భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలసి ఇంద్రప్రస్థనగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో మార్గమంతటా రత్నకంబళ్ళతో నిండిన పటకుటీరాలు విడిశాయి. వింజామరలూ విజయధ్వజాలూ విలసిల్లాయి. కిరీటాల నిగనిగలూ, వెల్లగొడుగుల ధగధగలూ. ఆయుధాల తళతళలూ సూర్యూడిని కప్పివేశాయి. మంగళవాద్యాల ధ్వనులు సముద్ర ఘోషాన్ని, తిమింగలాల ఘోషాన్ని అధిగమించాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=682 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: