Sunday, September 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౮(348)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-721-క.
పరికింపఁగ దేహం బ
స్థిరమని నిజబుద్ధిఁ దలఁచి చిరతరకీర్తి
స్ఫురణం బ్రస్తుతి కెక్కని
పురుషుఁడు జీవన్మృతుండు భూరివివేకా!
10.2-722-క.
ధారుణిలోన వదాన్యుల
కీ రాని పదార్థ మొక్కటేనిం గలదే
కోరినఁ దన మే యెముకలు
ధీరుండై యిచ్చె నని దధీచిని వినమే?
10.2-723-క.
అడిగిన వృథసేయక తన
యొడ లాఁకలిగొన్న యెఱుకు కోగిరముగ నే
ర్పడ నిచ్చి కీర్తిఁ గనె నని
పుడమిన్ మును వినమె యల కపోతము ననఘా! 

భావము:
ఓ మిక్కిలి తెలివైన వాడా! జరాసంధా! మానవుడు ఈ దేహం శాశ్వతం కాదని గ్రహించి, శాశ్వతమైన యశస్సును సంపాదించాలనే ఆసక్తి కలిగి మహాదాతగా ప్రసిద్ధి కెక్కవలెను. లేకపోతే, వాడు బ్రతికి ఉన్నా కూడా చచ్చినవాడితో సమానం. చేసే బుద్ధి ఉండాలి కానీ, దాతలకు దానం చేయరాని వస్తువు ఏమి ఉంటుంది? దేవతలు వచ్చి, తన శరీరంలోని ఎముకలను కోరిన వెంటనే ఇచ్చిన దధీచిని గూర్చి మనం వినలేదా? అడిగిన వెంటనే కాదనకుండా ఆకలిగొన్న బోయవాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించి కీర్తిని పొందిన పావురం కథ మనం వినలేదా? 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=723 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: