Sunday, September 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౯(329)


( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-673-వ.
వికచమరంద నవీన సౌరభ లస-
  న్మందార కుసుమదామములు దుఱిమి
చారు సుగంధ కస్తూరికా ఘనసార-
  మిళిత చందనపంక మెలిమి నలఁది
కనక కుండల రణత్కంకణ నూపుర-
  ముద్రికాభూషణములు ధరించి
యంచిత ముక్తాఫలాంచల మృదుల ది-
  వ్యాంబరములు సెలువారఁ గట్టి
10.2-674.1-తే.
యర్ధచంద్రుని నెకసక్కె మాడునట్టి
యలికఫలకలఁ దిలకము లలరఁ దీర్చి
పెంపు దీపింప నుడురాజబింబముఖులు
నవచతుర్విధ శృంగార మవధరించి.
10.2-675-తే.
జలజలోచను కడకు నుత్కలికతోడఁ
దనరు శిబికల నెక్కి నందనులుఁ దాముఁ
గనఁగ నేతేరఁ బ్రతిహారజనులు వేత్ర
కలితులై పౌరులను నెడగలుగ జడియ. 

భావము:
శ్రీకృష్ణుడి అంతఃపురకాంతలు మకరందాలుచిందుతూ సుగంధాలు వెదజల్లుతున్న వికసించిన మందారపూల హారాలు ధరించి; పరిమళభరితమైన కస్తూరి పచ్చకర్పూరంతో మేళవించిన మంచిగంధం మైపూతలు పూసుకుని; కంకణాలూ, కడియాలూ, ఉంగరాలూ, కుండలాలూ మున్నగు బంగారు ఆభరణాలు ధరించి; అంచులలో ముత్యాలు అలంకరించిన మెత్తని పట్టుచీరలు కట్టుకుని; అర్ధచంద్రబింబం వంటి నుదుట తిలకం పెట్టుకుని; ఎన్నో రకాల అలంకారాలతో నళినలోచనుని దగ్గరకు వచ్చారు. ఇలాగ, అంతఃపురకాంతలు పల్లకీలు ఎక్కి తమ సంతానంతో రాగా కావలివారు పౌరులను బెత్తాలతో ప్రక్కలకు ఒత్తిగించారు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=675 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: