Thursday, September 2, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౬(326)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-664-క.
ఆ మఖవేళ సమస్త ధ
రామండలిఁ గల్గు మేటిరాజులు మౌని
స్తోమంబును భవదీయ మ
హామహిమముఁ జూచి సత్కృతార్థతఁ బొందన్."
10.2-665-క.
కల" రని చెప్పిన నమ్ముని
పలుకులకు ముదంబు నొంది పంకజనాభుం
డెలనవ్వు మొగమునకుఁ జెలు
వొలయఁగఁ బాటించి యుద్ధవున కిట్లనియెన్.
10.2-666-క.
"ఉద్ధవ! మహిత వివేక స
మిద్ధవచోవిభవ! కార్య మేగతి నడచున్
వృద్ధవరానుమతంబుగ
బోద్ధవ్యము గాఁగఁ జెప్పు పురుషనిధానా!
10.2-667-తే.
అనఘచారిత్ర! నీవు మా యక్షియుగము
వంటివాఁడవు మనకు నవశ్య మగుచుఁ
జేయఁ దగినట్టి కార్యంబుఁ జెప్పు నీవు
ఏమి పంచినఁ గావింతు నిద్ధచరిత! "

భావము:
ధర్మరాజు చేసే యజ్ఞ సందర్భంగా భూమండలంమీద ఉన్న మహారాజులు మునీశ్వరులూ అందరూ నీ మహామహిమను దర్శించి ధన్యులు అవుతారు.” ఇలా పలికిన నారదుడి మాటలు వినిన శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుతో ఉద్ధవుడితో ఇలా అన్నాడు. “వివేక, వాక్చాతుర్యాలు కల ఉద్ధవా! పెద్దల సమ్మతించే సరళిలో ఆలోచించి ప్రస్తుత కర్తవ్యం ఏమిటో బాగా అర్థం అయ్యేలా వివరించు. ఓ పుణ్యాత్ముడా! నీవు మాకు మంత్రాంగము చెప్పువాడవు. ఇప్పుడు మనం చేయవలసిన, చేయతగిన కార్యాన్ని వెల్లడించు. నీవు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=667

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: