Wednesday, September 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౨(332)

( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-683-క.
కరి హరి రథ సుభట సము
త్కరములు సేవింప మురవిదారుఁడు గడచెన్
సరి దుపవన దుర్గ సరో
వర జనపద పుర పుళింద వన గోష్ఠములన్.
10.2-684-వ.
ఇట్లు గడచి చనుచు నానర్తక సౌవీర మరుదేశంబులు దాటి యిందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, సరస్వతీనది దాఁటి పాంచాల మత్స్యవిషయంబులు లోనుగాఁ గడచి యింద్ర ప్రస్థనగరంబు డాయం జని, తత్పురోపకంఠవనంబున విడిసిన. 

భావము:
ఈ విధంగా మురాసురసంహారుడు శ్రీకృష్ణుడు రథ, గజ, తురగ, పదాతిసేనా సమూహాలు గల చతురంగ బలాలు సేవిస్తూ ఉండగా నదులనూ, వనాలనూ, కోటలనూ, జలాశయాలనూ, గ్రామాలనూ, పట్టణాలనూ, భిల్లపల్లెలను, తపోవనాలను, గోష్ఠాలను దాటాడు. ఇలా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుడు సౌవీరాది దేశాలను అతిక్రమించి; ఇందుమతీనదిని దర్శించి; దృషద్వతీ, సరస్వతీ నదులను, పాంచాల, మత్స్య దేశాలను గడచి; ఇంద్రప్రస్థ నగరం చేరి, ఆ పట్టణం దగ్గరగా ఉన్న ఉపవనంలో విడిది చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=684 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: