Monday, September 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౦(330)


( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-676-క.
అసమాస్త్రుఁడు పులు గడిగిన
కుసుమాస్త్రములను హసించు కోమలతనువుల్‌
మిసమిస మెఱవఁగ వేశ్యా
విసరము దాసీజనంబు విభవ మెలర్పన్.
10.2-677-ఆ.
హరుల వేసడములఁ గరులను నెక్కి తో
నరుగుదేర బహువిధాయుధములు
దాల్చి సుభటకోటి దగిలి రా నంతఃపు
రాంగనలు సితాంబుజాక్షు కడకు.
10.2-678-వ.
వచ్చి రంత.
10.2-679-క.
నారదుని మాధవుఁడు స
త్కారంబున వీడుకొలుప నతఁడును హృదయాం
భోరుహమునఁ గృష్ణునకును
వారక మ్రొక్కుచును వెస దివంబున కరిగెన్. 

భావము:
పూవిల్తుని స్వచ్ఛమైన పూలబాణాలవంటి మిసమిసలాడే మెత్తని మేనులతో మెఱసిపోయే ఆటవెలదులూ, దాసీ సమూహాలూ వైభవంగా తోడు వస్తుండగా ఆవిధంగా దాసదాసీ జనాలు అందరూ గుఱ్ఱాలు, కంచర గాడిదలు, ఏనుగులు ఎక్కి కూడా వస్తున్నారు. రకరకాల ఆయుధాలు ధరించిన భటులు వెంట వస్తున్నారు. ఆ విధంగా సకల వైభవాలతో అంతఃపుర సుందరాంగులు తెల్ల తామరల వంటి కన్నులు ఉన్న గోవిందుడి దగ్గరకు వచ్చారు. అలా తన అంతఃపుర కాంతులు వస్తున్న సమయంలో నారదమహర్షిని శ్రీకృష్ణుడు గౌరవించి సాగనంపాడు. ఆ మహర్షి మనస్సులో మాధవునకు మాటిమటికీ నమస్కారాలు చేస్తూ స్వర్గలోకంవైపు వెళ్ళాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=679 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: