Friday, September 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౭(327)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-668-వ.
అని సర్వజ్ఞుండైన హరి యజ్ఞుండ పోలెఁ దన్ను నడిగినఁ బురుషోత్తముని భాషణంబులకు మనంబున సంతసిల్లి, యతని పాదంబులు దన మనంబున నిడికొని, “వృద్ధానుమతంబుగా నా యెఱింగిన తెఱంగు విన్నవించెద నవధరింపుము; దేవా! దేవముని చెప్పినట్లు భవదీయ భక్తుండైన యుధిష్ఠిరు యాగపాలనంబు సేయం గైకొనుట కార్యం; బదియునుంగాక నిఖిల దిగ్విజయ మూలంబగు రాజసూయ కృత్యంబునందు జరాసంధ మర్దనంబును, నతనిచే బద్ధులైన రాజులం గారాగృహ విముక్తులం గావించుటయుం జేకూరు; నదియునుం గాక నాగాయుతసత్త్వుండును, శతాక్షౌహిణీ బలాన్వితుండును నగు మాగధుని వధియింప మన ప్రభంజననందనుండు గాని యొండొరులు సమర్థలుగా; రట్లగుట నతండు భూసురు లేమి గోరిన, నయ్యర్థంబు వృథసేయక యిచ్చుం; గావున గపటవిప్రవేషంబునం జని యా జరాసంధుని నాహవ భిక్షవేఁడి, భవత్సన్నిధానంబున నప్పవమానతనయుం డతని వధియించునట్టి కార్యంబుసేఁత బహుళార్థసాధనంబగు” నని పలికిన నారదుండును యాదవ జనంబులును సభ్యులునుం బొగడి; రంత.

భావము:
ఇలా సర్వజ్ఞుడైన కృష్ణుడు అమాయకుడిలా ఉద్ధవుడిని ప్రశ్నించాడు. అందుకు ఉద్ధవుడు ఎంతో సంతోషించి, శ్రీకృష్ణుడి పాదాలను మనసులో ధ్యానించుకుని ఇలా అన్నాడు. “దేవా! పెద్దలు సమ్మతించేలా నాకు తెలిసిన విధానం వివరిస్తాను. చిత్తగించండి నారదుడు చెప్పినట్లుగా మీ భక్తుడైన ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం ఆవశ్యం కర్తవ్యం. సమస్త దిక్కులనూ జయించడానికి మూలమైన రాజసూయయాగ సందర్భంలో జరాసంధుణ్ణి సంహరించటం. వాడిచేత బంధించబడ్డ రాజులను చెరనుండి విముక్తులను చేయడం కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా, పదివేల ఏనుగుల బలం కలవాడూ నూరు అక్షౌహిణుల సైన్యంకలిగిన జరాసంధుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప మరింకెవరూ సమర్థులు కారు. బ్రాహ్మణులు ఏమికోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు. కాబట్టి, కపట బ్రాహ్మణవేషాలతో వెళ్ళి ఆజరాసంధుణ్ణి యుద్ధభిక్ష యాచించి మన భీమసేనుడి ద్వారా వాడిని సంహరించడం జరిగితే సకల ప్రయోజనాలను సాధించినట్లు అవుతుంది.” ఇలా పలికిన ఉద్ధవుడి మాటలు విని నారదుడూ యాదవులూ అందరూ పొగిడారు. ఆ సమయంలో.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=668

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: