Monday, September 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౯(349)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-724-క.
ఆ యింద్రాగ్నులు శ్యేనక
వాయస రూపములఁ దన్ను వలఁతిగ వేఁడన్
ధీయుతుఁడై మును శిబి తన
కాయము గోసిచ్చె నన జగంబుల వినమే!
10.2-725-ఆ.
ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర
బలులు నుంఛవృత్తి బ్రాహ్మణునిని
మున్ను సెప్ప వినమె? సన్నుతచరితులు
సన్న నైన నేఁడు నున్నవారు. " 

భావము:
ఆ ఇంద్రుడు డేగ రూపంలో, అగ్ని కాకి రూపంలో వచ్చి తనను కోరగా శిబిచక్రవర్తి గొప్ప బుద్ధితో తన దేహాన్నే కోసి ఇచ్చాడని మనం వినలేదా? మహా ధీరులు అయిన రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, బిచ్చమెత్తుకుని జీవించే బ్రాహ్మణుడు సక్తుప్రస్థుడు మున్నగువారి గురించి చెప్పుకోవటం పూర్వం నుంచీ వింటున్నాం కదా. స్తుతిపాత్రమైన చరితార్థులు ఆ మహనీయులు ఎప్పుడో మరణించినా, ఈనాటికీ బ్రతికి ఉన్నవారే.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=725 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: