Friday, September 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౭(347)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-718-వ.
ఇట్లు కృష్ణభీమార్జునులు బ్రాహ్మణ వేషంబులు దాల్చి త్రేతాగ్నులుం బోలెఁ దమ శరీరతేజోవిశేషంబులు వెలుంగ, నతిత్వరితగతిం జని గిరివ్రజంబు సొచ్చి యందు యతిథిపూజలు శ్రద్ధాగరిష్ఠ చిత్తుండై కావించుచున్న జరాసంధునిం గనుంగొని యిట్లనిరి.
10.2-719-క.
"ధరణీశ! యతిథిపూజా
పరుఁడవు నీ వనుచు దిశలఁ బలుకఁగ విని మే
మరుదెంచితిమి మదీప్సిత
మఱ సేయక యిమ్ము సువ్రతాచారనిధీ!
10.2-720-క.
అతిథిజనంబుల భక్తిన్
సతతముఁ బూజించి యుచితసత్కారము లు
న్నతి నడపు సజ్జనులు శా
శ్వతకీర్తులు ధరణిఁబడయఁజాలుదు రనఘా! 

భావము:
అలా బ్రాహ్మణ వేషాలు ధరించిన శ్రీకృష్ణ భీమ అర్జునులు ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నుల్లాగా ప్రకాశిస్తూ అతి శీఘ్రంగా గిరివ్రజానికి వెళ్ళారు. మిక్కిలి శ్రద్ధాభక్తులతో తమకు అతిథి సపర్యలు చేస్తున్న జరాసంధుడితో ఇలా అన్నారు. “ఓ మగధరాజా! జరాసంధా! ఓ సదాచార సంపన్నా! అతిథి సేవ చేయటంలో బాగా పేరు పొందినవాడిగా దిగంత విశ్రాంతమైన నీ కీర్తి విని, నీ దగ్గరకు వచ్చాము. మా కోరిక కాదనక తీర్చు. ఓ పుణ్యాత్మా! అతిథి జనాన్ని ఎల్లప్పుడూ భక్తితో సేవించి, వారికి ఉచిత సత్కారాలు చేసే సత్పురుషులు లోకంలో శాశ్వతకీర్తిని పొందుతారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=720 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: