Thursday, August 23, 2018

శ్రీకృష్ణ లీలలు - 74

10.1-421-క.
భిక్షులు వచ్చెద రేడ్చిన; 
భిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్
శిక్షించెద; రని చెప్పిన
భిక్షులఁ గని, తల్లిఁ గనియు భీతిల్లు నృపా!
10.1-422-వ.
ఇట్లు కృష్ణుండు బహువిధంబులఁ గపటబాలలీలల వినోదింప, బృహద్వనంబున నందాదు లైన గోపవృద్ధులు మహోత్పాతంబు లగుటయు, వానివలన బాలుం డుత్తరించుటయుఁ జూచి యేకాంతంబున నొక్కనాడు విచారింప నుపనందుం డను వృద్ధగోపకుండు తన యెఱుక మెఱసి యిట్లనియె.

భావము:
ఓ మహారాజా! యశోదాదేవి “ఏడవుకురా కన్నా! ఇదిగో బిచ్చగాళ్లు వస్తున్నారు. ఏడుస్తుంటే వాళ్ళు నిన్ను జోలెలో వేసుకొని తీసుకు వెళ్ళి కొడతారు జాగ్రత్త” అని బెదిరించింది. చిన్నికిట్టయ్య వాకిట్లోకి వచ్చిన బిచ్చగాళ్లను చూసి, తల్లి వైపు భయపడుతూ చూసాడు. ఇలా చిన్ని కృష్ణుడు కపటబాలలీలలు చూపుతూ క్రీడిస్తూ గోపికలను, గోపాలురను, అందరిని వినోదింపజేస్తున్నాడు. ఒకరోజు నందుడూ, ఇతర గోపాలక పెద్దలూ వ్రేపల్లె దగ్గరి పెద్ద తోటలో సమావేశం అయ్యారు. అప్పటివరకు జరిగిన భయంకరమైన ఉత్పాతాలూ, వాటినుంచి కృష్ణుడు తప్పించుకోటం మున్నగు విషయాలు చర్చించారు. వారిలో ఉపనందుడు అనే వృద్ధగోపాలుడు బుద్ధిలో దైవసంకల్పం వలన ఒక ఆలోచన మెరిసింది, అతడు యాదవులందరం కలిసి బృందావనం వెళదాం అని అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=58&padyam=421

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: