Friday, August 17, 2018

శ్రీకృష్ణ లీలలు - 69

10.1-412-వ.
అని యీశ్వరుండు మీరు “మీ నెలవులకుం బొం” డని యానతిచ్చిన, మహాప్రసాదం బని వలగొని పెక్కు మ్రొక్కులిడి, నలకూబర మణిగ్రీవు లుత్తర భాగంబున కరిగి రంత; నందాదు లైన గోపాలకులు నిర్మూలంబులై పడిన సాలంబుల చప్పుడు పిడుగు చప్పు డని శంకించి వచ్చి చూచి.
10.1-413-క.
"ఈ పాదపములు గూలఁగ
నీ పాపఁ డులూఖలమున నిటు బద్ధుండై
యే పగిది బ్రతికెఁ? గంటిరె; 
వాపోవఁడు; వెఱవఁ; డెట్టివాఁడో యితఁడున్.


భావము:
ఇలా చెప్పి, “ఇక మీరు మీ లోకాలకు పోవచ్చును” అని కృష్ణుడు అనుజ్ఞ ఇచ్చాడు. యక్షులు “మహాప్రసాదం” అంటూ ప్రదక్షిణలు చేసి, అనేక విధాలుగా మ్రొక్కి, సెలవు తీసుకొని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. ఇంతలో నందుడు మొదలైన గోపకులు చప్పుడు విని, పిడుగు పడిందేమో అని భయపడి వచ్చి కృష్ణబాలునీ, పడిన మద్దిచెట్లనూ చూసారు. “అయ్యో! ఇంత పెద్ద చెట్లు ఇలా కూలిపోతే, ఇలా రోటికి కట్టివేయబడి ఉన్న ఈ చంటిపిల్లాడు ఎలా బ్రతికి ఉన్నాడో? చూశారా! ఏడవనూ లేదు, భయపడనూ లేదు. ఏం పిల్లాడురా బాబూ వీడు?



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: