Friday, August 10, 2018

శ్రీకృష్ణ లీలలు - 62

10.1-399-వ.
అని యిట్లు పలికి నారదుండు నారాయణాశ్రమంబునకుం జనియె వారిరువురు సంగడిమద్దు లైరి, పరమభాగవతుండైన నారదు మాటలు వీటింబుచ్చక పాటించి.
10.1-400-క.
ముద్దుల తక్కరిబిడ్డఁడు
మద్దులఁ గూల్పంగ దలఁచి మసలక తా నా
మద్దికవ యున్న చోటికిఁ 
గ్రద్దన ఱో లీడ్చుకొనుచుఁ గడకం జనియెన్.


భావము:
ఇలా శాపమూ విమోచనమూ చెప్పి, నారదుడు నారయణాశ్రమానికి వెళ్ళిపోయాడు: వాళ్ళిద్దరు జంట మద్ది చెట్లుగా భూలోకంలో పక్కపక్కన పడిఉన్నారు, నారదమహర్షి పరమభాగవతోత్తముడు కనుక శ్రీకృష్ణపరమాత్మ ఆయన మాటలను పాటించదలచాడు. ఆ టక్కులమారి ముద్దుకృష్టుడు ఆ రెండు మద్దిచెట్లను కూల్చాలని సంకల్పించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మద్దిచెట్ల జంట దగ్గరకు అమాతంగా ఱోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: