Wednesday, August 8, 2018

శ్రీకృష్ణ లీలలు - ౫౭

10.1-390-క.
జ్ఞానులచే మౌనులచే
దానులచే యోగ సంవిధానులచేతం
బూని నిబద్దుం డగునే
శ్రీనాథుఁడు భక్తియుతులచేతం బోలెన్?
10.1-391-వ.
అంత నయ్యశోద యింటికడఁ బనులవెంటందిరుగఁ గృష్ణుఁడు తొల్లి నారదు శాపంబున నిరుమద్దులై యున్న నలకూబర మణిగ్రీవు లను గుహ్యకుల నిద్దఱం గని ఱో లీడ్చుకొని చనియె" నని చెప్పిన శుకయోగివరునకు భూవరుం డిట్లనియె.

భావము:
భక్తులకు పట్టుబడినట్లు భగవంతుడు జ్ఞానులకు గానీ, మునులకు గానీ, దాతలకు గానీ, యోగీశ్వరులకు గానీ పట్టుబడడు గదా! తల్లి యశోదాదేవి కొడుకు కృష్ణుని అలా రోటికి కట్టివేసి, ఇంట్లో పనులు చేసుకోవటంలో మునిగిపోయింది. నలకూబరుడు, మణిగ్రీవుడు అనే ఇద్దరు యక్షులు నారదుని శాపం వలన చాలాకాలంనుంచి రెండు పెద్దపెద్ద మద్దిచెట్లుగా పడి ఉన్నారు. కృష్ణబాలుడు ఆ మద్దిచెట్ల జంటను చూసాడు. రోలును ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరకు వెళ్ళాడు" ఇలా శుకబ్రహ్మ చెప్పగా విన్న మహారాజు ఇలా అడిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=390

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: