Monday, March 29, 2021

శ్రీకృష్ణ విజయము - 185

( శతధన్వుఁడు మణి గొనిపోవుట )

10.2-85-వ.
ఇట్లు హతుం డైన తండ్రిం గని శోకించి సత్యభామ యతనిం దైలద్రోణియందుఁ బెట్టించి హస్తిపురంబునకుం జని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తు మరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు నీశ్వరులయ్యును మనుష్య భావంబుల విలపించి; రంత బలభద్ర సత్యభామా సమేతుండై హరి ద్వారకా నగరంబునకు మరలివచ్చి శతధన్వుం జంపెద నని తలంచిన; నెఱింగి శతధన్వుండు ప్రాణభయంబునఁ గృతవర్ము నింటికిం జని తనకు సహాయుండవు గమ్మని పలికినం గృతవర్మ యిట్లనియె.
10.2-86-ఉ.
"అక్కట! రామకృష్ణులు మహాత్ములు వారల కెగ్గు సేయఁగా
నిక్కడ నెవ్వఁ డోపు? విను మేర్పడఁ గంసుఁడు బంధుయుక్తుఁడై
చిక్కఁడె? మున్ను మాగధుఁడు సేనలతోఁ బదియేడు తోయముల్‌
దిక్కులఁ బాఱఁడే! మనకు దృష్టము, వారల లావు వింతయే? "

భావము:
సత్యభామ తండ్రి మరణానికి దుఃఖించి తండ్రి శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టించి, హస్తినాపురానికి వెళ్ళి శ్రీకృష్ణునితో సత్రాజిత్తు మరణం విషయం చెప్పింది. బలరామకృష్ణులు భగవంతులై ఉండి కూడా మనుష్య భావంతో దుఃఖించారు. బలరామ, సత్యభామలతో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు శతధన్వుని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. శతధన్వుడు ప్రాణభయంతో కృతవర్మ ఇంటికి వెళ్ళి తనకు సహాయపడ మని కోరాడు. అప్పుడు, శతధన్వునితో కృతవర్మ ఇలా అన్నాడు. “అయ్యో! ఎంత పనిచేశావు. బలరామకృష్ణులు మహానుభావులు. వారిని ఎదుర్కొని కీడు చేయగల సమర్ధులు ఇక్కడ ఎవరు లేరు. కంసుడు బంధు మిత్ర సమేతంగా నేలకూలలేదా? జరాసంధుడు పదిహేడు పర్యాయాలు పరాజితుడు కాలేదా? వారి పరాక్రమాలు మనకు క్రొత్త ఏమీ కాదు కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=11&Padyam=86

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: