Monday, March 29, 2021

శ్రీకృష్ణ విజయము - 184

( శతధన్వుఁడు మణి గొనిపోవుట )

10.2-83-వ.
అంత నక్కడఁ గుంతీసహితులయిన పాండవులు లాక్షాగారంబున దగ్ధులైరని విని నిఖిలార్థ దర్శనుండయ్యును, గృష్ణుండు బలభద్ర సహితుండై కరినగరంబునకుం జని కృప విదుర గాంధారీ భీష్మ ద్రోణులం గని దుఃఖోపశమనాలాపంబు లాడుచుండె; నయ్యెడ.
10.2-84-సీ.
జగతీశ! విన వయ్య శతధన్వుఁ బొడగని-
  యక్రూర కృతవర్మ లాప్తవృత్తి
"మన కిత్తు ననుచు సమ్మతిఁ జేసి తన కూఁతుఁ-
  బద్మాక్షునకు నిచ్చి పాడి దప్పె
ఖలుఁడు సత్రాజిత్తుఁ, డలయ కే క్రియ నైన-
  మణిపుచ్చుకొనుము నీమతము మెఱసి"
యని తన్నుఁ బ్రేరేఁప నా శతధన్వుఁడు-
  పశువుఁ గటికివాఁడు పట్టి చంపు
10.2-84.1-ఆ.
కరణి నిదురవోవఁ గడఁగి సత్రాజిత్తుఁ
బట్టి చంపి, వాని భామ లెల్ల
మొఱలువెట్ట లోభమునఁ జేసి మణి గొంచుఁ
జనియె నొక్క నాఁడు జనవరేణ్య!

భావము:
ఇంతలో అక్కడ లక్కఇంటిలో పాండవులు కుంతీ సహితంగా దగ్ధమయ్యారు అని శ్రీకృష్ణుడు విన్నాడు. సర్వము తెలిసిన వాడై కూడా, ఆయన బలరాముడి తోపాటు హస్తినాపురానికి వెళ్ళి కృప, విదుర, గాంధారీ, భీష్మ, ద్రోణులను ఓదార్చాడు. ఓ పరీక్షన్నరేంద్రా! అక్రూరుడూ, కృతవర్మా, శతధన్వుడిని కలిసి “దురామార్గుడైన సత్రాజిత్తు సత్యభామను మనకు ఇస్తానని చెప్పి, శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేసి మాట తప్పాడు. నీవు ఏదో విధంగా శమంతకమణిని గ్రహించు” అని ప్రేమ ఒలకబోస్తూ ప్రేరేపించారు. శతధన్వుడు కసాయివాడు పశువును పట్టుకుని చంపినట్లుగా, నిద్రపోతున్న సత్రాజిత్తును బలవంతంగా చంపివేశాడు. సత్రాజిత్తు భార్యలు రోదిస్తుండగా లోభంతో మణిని తీసుకుపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=11&Padyam=84

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: