Thursday, March 25, 2021

శ్రీకృష్ణ విజయము - 180

( జాంబవతి పరిణయంబు )

10.2-73-క.
డోలాయిత మానసులై
జాలింబడి జనులు గొలువఁ జండిక పలికెన్
"బాలామణితో మణితో
హేలాగతి వచ్చు నంబుజేక్షణుఁ" డనుచున్.
10.2-74-క.
యత్నము సఫలం బయిన స
పత్న సమూహములు బెగడఁ బద్మాక్షుం డా
రత్నముతోఁ గన్యాజన
రత్నముతోఁ బురికి వచ్చె రయమున నంతన్.
10.2-75-క.
మృతుఁ డైనవాఁడు పునరా
గతుఁడైన క్రియం దలంచి కన్యామణి సం
యుతుఁడై వచ్చిన హరిఁ గని
వితతోత్సవ కౌతుకముల వెలసిరి పౌరుల్‌.

భావము:
ప్రజలు ఇలా సంశయాత్మకులై దీనంగా ప్రార్థించగా “మణితో, బాలామణితో పద్మాక్షుడు అనాయాసంగా తిరిగి వస్తా”డని దుర్గాదేవి పలికింది. ఇంతలో విరోధులందరూ బెదరిపోయేలా తన ప్రయత్నాన్ని సఫలం చేసుకుని మణితో, బాలామణితో శ్రీకృష్ణుడు వేగంగా ద్వారకాపురం చేరాడు. కన్యాకమణితో వచ్చిన శ్రీహరిని గాంచి మరణించినవాడు తిరిగి వచ్చినంతగా ద్వారకాపుర పౌరులు ఎంతో వేడుకతో సంతోషించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=75

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: