Sunday, October 4, 2020

శ్రీ కృష్ణ విజయము - 44

( కృష్ణుడు మథురను గనుట )

10.1-1254-క.
అని మఱియుఁ బౌరకాంతలు
మునుకొని హరిరూపు నేత్రముల వెంటను లోఁ
గొని తాల్చిరి హృదయములను
జనితప్రమదమున విరులు సల్లుచు నధిపా!
10.1-1255-వ.
మఱియును.
10.1-1256-క.
నానావిధ గంధములు ప్ర
సూనఫలాదులును హరితశుభలాజములుం
గానుక లిచ్చుచు విప్రులు
మానుగఁ బూజించి రా కుమారోత్తములన్.

భావము:
అంటూ ఓ పరీక్షన్మహారాజా! ఆ నగర వనితలు సంతోషంతో పూలు జల్లుతూ, అదేపనిగా ఆయన రూపాన్ని కళ్ళతో ఆస్వాదిస్తూ, తమ హృదయములలో కృష్ణుడి రూపాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఇంకా ఆ మధురానగరంలోని బ్రాహ్మణులు అనేక రకాల సువాసన ద్రవ్యాలు, పూలు, పండ్లు మున్నగువాటిని; శుభకరములైన పచ్చని అక్షతలనూ కానుకలుగా ఇస్తూ ఉత్తములైన ఆ వసుదేవకుమారులను ఉత్సాహంగా పూజించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=144&padyam=1256

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: