Monday, September 28, 2020

శ్రీ కృష్ణ విజయము - 41

( కృష్ణుడు మథురను గనుట )

10.1-1247-మ.
పరిఖల్ గోటలు కొమ్మలుం బడగలుం బ్రాసాదముల్ వీధులున్
హరులుం దేరులు వీరులున్ గజములున్ హర్మ్యంబులున్ వాద్యముల్
తరుణుల్ ధాన్యములున్ ధనంబులు మహోద్యానంబులున్ దీర్ఘికల్
గర మాశ్చర్యరుచిం దనర్చు మథురన్ గాంచెన్ విభుం డంతటన్.
10.1-1248-వ.
కని య ప్పురంబు ప్రవేశించి వచ్చు సమయంబున.
10.1-1249-ఉ.
"నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము; గోపకామినీ
బృందము నోముపంట; సిరివిందు దయాంబుధి యోగిబృందముల్
డెందము లందుఁ గోరెడు కడింది నిధానము చేరవచ్చె నో! 
సుందరులార! రండు చని చూతము కన్నుల కోర్కిదీరఁగన్. "

భావము:
శ్రీకృష్ణుడు అల్లంతదూరంలో అగడ్తలు, కోటలు, బురుజులు, పతాకాలు, రాజభవనాలు, వీధులు, గుఱ్ఱాలు, రథాలు, వీరులు, ఏనుగులు, మేడలు, వాద్యాలు, యువతులు, ధాన్యాలు, ధనాలు, గొప్ప గొప్ప ఉద్యాన వనాలు, నడబావులు మున్నగు వాటి అత్యద్భుతమైన శోభతో ఒప్పునట్టి మధురను చూసాడు. అలా చూసి, ఆ పట్టణంలో ప్రవేశించి సంచరిస్తున్న సమయంలో “ఓ రమణులారా! నందుడి తపస్సుకు ఫలముగా కలిగిన వాడు, మేలిగుణాల ప్రోవు అయిన వాడు, గొల్ల పడచుల నోముల పంట ఐన వాడు, లక్ష్మీదేవి హృదయానికి ఆనందం కూర్చేవాడు, కరుణాసముద్రుడు, యోగులు అందరూ తమ మనస్సులో కోరుకునే అపురూపమైన పెన్నిధి వంటివాడు అయిన శ్రీకృష్ణుల వారు వస్తున్నారు. కన్నుల కాంక్ష తీరేలా వెళ్ళి వీక్షిద్దాము రండి”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=144&padyam=1249

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: