Monday, September 14, 2020

శ్రీ కృష్ణ విజయము - 24

( అక్రూర నందాదుల సంభాషణ )

10.1-1206-క.
"చెలియలు మొఱయిడ నల్లుర
ఖలుఁడై పొరిగొనిన యట్టి కంసుఁడు బ్రదుకం
గలదే మనకి దశార్హుల
కిలపై? మీ క్షేమ మింక నేమని యడుగన్?"
10.1-1207-వ.
అని పలికె నంత నక్రూరుం డొక పర్యంకంబున సుఖోపవిష్టుండై యుండ హరి యిట్లనియె.
10.1-1208-మ.
“శుభమే నీకుఁ? బ్రమోదమే సఖులకుం? జుట్టాలకున్ క్షేమమే?
యభయంబే ప్రజకెల్ల? గోత్రజుల కత్యానందమే? మామ ము
క్త భయుండే? వసుదేవ దేవకులు తత్కారాగృహం బందు మ
త్ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై?

భావము:
“ఓ అక్రూరా! చెల్లెలు మొరపెడుతున్నా వినకుండా అల్లుళ్ళను చంపిన ఆ నీచుడు కంసుడు బ్రతికి ఉండగా దశార్హ వంశం వారైన మనకు కుశలం ఈ భూమ్మీద లేదు కదా. ఇంక మీ క్షేమసమాచారాలు ఏమని అడిగేది." అలా నందమహారాజు పలకరించాక, మంచం మీద సుఖంగా కూర్చుని ఉన్న అక్రూరుడితో కృష్ణుడు ఇలా అన్నాడు. “అక్రూరా! నీకు కుశలమేనా? మీ స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు కదా! చుట్టాలకు క్షేమమా? ప్రజలంతా భయాలు లేకుండా ఉన్నారా? కులబంధువులు అందరూ ఆనందంగా ఉన్నారా? మా మామ కంసుడు నిర్భయంగా ఉన్నాడా? నన్ను కన్నారన్న సాకుతో కారాగారంలో బంధింపబడిన దేవకీ వసుదేవులు ప్రాణాలతో బ్రతికే ఉన్నారా? వివరంగా చెప్పు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=140&padyam=1206

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: