Saturday, September 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 40

( శ్రీమానినీచోర దండకము )

10.1-1244-వ.
అని మఱియుం బ్రార్థించిన హరి యిట్లనియె.
10.1-1245-క.
"యదుకుల విద్వేషణుఁడై
మదమున వర్తించు కంసు మర్దించి భవ
త్సదనంబుఁ జూడ వచ్చెదఁ
బొద యీ స్యందనముఁ గొనుచుఁ బురమున కనఘా!"
10.1-1246-వ.
అని పలికిన నక్రూరుండు పురంబునకుం జని రామకృష్ణులు వచ్చిరని కంసున కెఱింగించి తన గృహంబునకుం జనియె; నంత నపరాహ్ణంబున బలభద్ర గోపాల సహితుండై కృష్ణుండు.

భావము:
అంటూ మరీ మరీ వేడుకుంటున్న అక్రూరునితో హరి ఇలా అన్నాడు. “పాపరహితుడవైన అక్రూరా! యాదవులకు శత్రువై గర్వంతో సంచరిస్తున్న కంసుణ్ణి సంహరించిన తర్వాత నీ గృహం సందర్శించడానికి వస్తాను. ఇప్పుడు నీవు ఈ రథాన్ని తీసుకుని నగరానికి వెళ్ళు.” ఇలా చెప్పిన శ్రీకృష్ణుడి మాటలు విని, అక్రూరుడు నగరంలోకి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెల్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు మధ్యాహ్నం సమయంలో బలరాముడు గోపకులు తాను కలిసి మథురానగరం ప్రవేశించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1245

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: