Thursday, September 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 38

( శ్రీమానినీచోర దండకము )

10.1-1237-మ.
కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్
జలవాంఛారతి నెండమావులకు నాసల్ చేయు చందంబునం
దలఁతున్ సత్యములంచు; మూఢుఁడ వృధాతత్వజ్ఞుఁడన్నాకు నీ
విలసత్పాదయుగంబుఁ జూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ!"
10.1-1238-వ.
అని మఱియును వినుతింప, నక్రూరునికి యమునాజలంబుల లోనం దన మొదలి మేను చూపి, చాలించి, నటునికైవడిఁ దిరోహితుండైన, నక్రూరుండు నీరు వెడలి వెఱంగుపడుచు వచ్చి, రథారోహణంబు చేసిన హరి యిట్లనియె.
10.1-1239-క.
“జలములు చేరువ నున్నవి
తలపోయఁగ నీవు పోయి తడ వయ్యె; నదీ
జలముల నభమున ధరణిం
గలుగని చోద్యములు నీకుఁ గానంబడెనే?"

భావము:
లక్ష్మీనాథుడవైన శ్రీకృష్ణా! దాహం తీర్చుకోడానికి జలము వలె తోచే ఎండమావులకు ఆశపడినట్లు స్వప్న సమానము లయిన పుత్రులు మిత్రులు కళత్రములు గృహములు మొదలైన జంజాటము సత్యమని భావిస్తుంటాను. నేను మూఢుణ్ణి మిథ్యాతత్త్వజ్ఞుణ్ణి ఇలాంటి నాకు ప్రకాశించు నీ పాదాల జంటను చూపి కరుణతో కటాక్షించు.” అని మరల మరల తనను స్తోత్రం చేస్తున్న అక్రూరుడికి తన పూర్వరూపం చూపి నటుడు తన పాత్ర పోషణ అయ్యాక ఆ వేషాన్ని తెరమరుగైనట్లు, తిరిగి దానిని మరగుపరచి భగవంతుడు అంతర్ధానం అయిపోయాడు. అక్రూరుడు నీటి నుండి బయటకు వచ్చి ఆశ్చర్యపోతూ వచ్చి రథాన్ని అధిరోహించాడు. అప్పుడు కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. “నీళ్ళు దగ్గరలోనే ఉన్నాయి కదా. నీవు స్నానానికి వెళ్ళి చాలా సేపయింది. ఆకాశంలోనూ, భూమిలోనూ లేని వింతలేమైనా నదీజలాలలో కాని కన్పించాయా?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1239

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: