Wednesday, September 9, 2020

శ్రీ కృష్ణ విజయము - 23

( అక్రూరుడు బలకృష్ణుల గనుట )

10.1-1204-క.
అక్రూరులైన జనుల న
వక్రగతిం గాచు భక్తవత్సలుఁ డంత
న్నక్రూరుఁ గౌఁగిలించెను
జక్రాంకిత హస్తతలముఁ జాచి నరేంద్రా.
10.1-1205-వ.
మఱియు నక్రూరుఁడు బలభద్రునికిం బ్రణతుం డయినఁ నతండు గౌఁగిలించి చెట్టపట్టుకొని కృష్ణసహితుండై గృహంబునకుం గొనిపోయి మేలడిగి గద్దియనిడి పాదప్రక్షాళనంబు చేసి మధుపర్కంబు సమర్పించి గోవునిచ్చి యాదరంబున రసవదన్నంబు పెట్టించి తాంబూల గంధ మాల్యంబు లొసంగె; నయ్యవసరంబున నందుం డుపవిష్టుండైన యక్రూరుని సత్కరించి' యిట్లనియె.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! సాధుస్వభావులను చక్కగా పాలించే భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు చక్రం గుర్తులు గల తన చేతులు చాపి అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అటుపిమ్మట, అక్రూరుడు బలరాముడికి ప్రణమిల్లాడు. అతడు అక్రూరుని కౌఁగిలించుకున్నాడు. అతడి చెయ్యి పట్టుకుని కృష్ణునితో కూడ తమ గృహానికి తీసుకువెళ్ళాడు. కుశలప్రశ్నలు అడిగాడు. అరుగు మీద కూర్చుండబెట్టి కాళ్ళు కడిగాడు. మధుపర్కం సమర్పించాడు. ఆవుని దానం చేసాడు. సాదరంగా కమ్మని భోజనం పెట్టించాడు. తాంబూలం, చందనం, పూలదండలు ఇచ్చాడు. ఆ సమయంలో నందుడు అక్కడ కూర్చున్న అక్రూరుడిని ఆదరించి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=139&padyam=1205

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: