Saturday, September 19, 2020

శ్రీ కృష్ణ విజయము - 33

( అక్రూరుని దివ్యదర్శనములు )

10.1-1229-ఉ.
స్నానము చేసిచేసి నది చల్లని నీటను రామకృష్ణులన్
మానుగఁ జూచి "వారు రథమధ్యముపై వసియించి యున్నవా
రీ నది నీటిలోపలికి నెప్పుడు వచ్చి?" రటంచు లేచి మే
ధానిధి చూచె వారిని రథస్థుల భక్తమనోరథస్థులన్.
10.1-1230-వ.
చూచి వెఱఁగుపడి.
10.1-1231-శా.
"కంటిన్ మున్ను రథంబుపై; జలములోఁ గంటిం దుదిం గ్రమ్మఱం
గంటిం దొంటి రథంబుమీఁద; నిదె యీ కల్యాణచారిత్రు లే
వెంటం దోఁచిరి రెండు దిక్కుల; మనోవిభ్రాంతియో? నీటిలో
నుం టాశ్చర్యము; చూతు" నంచు మఱియు న్నూహించి మగ్నాంగుఁడై.

భావము:
అలా వేదమంత్రాలు జపిస్తూ జపిస్తూ అక్రూరుడు మెల్లిగా స్నానం చేయసాగాడు. ఇంతలో అతనికి ఆ చల్లని నదీజలంలో బలరామకృష్ణులు చక్కగా కనబడ్డారు. “వీరు ఇంతదాక రథంలో కూర్చుని ఉన్నారు కదా. మరి ఈ యమున నీళ్ళలోకి ఎప్పుడు వచ్చారు? ” అనుకుంటూ లేచి, బుద్ధిశాలి అయిన ఆ అక్రూరుడు భక్తుల మనోరథాలు చేకూర్చే వారిద్దరూ మళ్ళీ ఆ రథంలోనే ఉండడం చూసాడు. అలా నీటిలోనూ రథంలోనూ కనబడుతున్న వారిని చూసి ఆశ్చర్యపడి. “ముందు రథంలో చూసాను. తరువాత నీటిలో వీక్షించాను. మళ్ళీ వారు ముందటి లాగే రథం మీదనే ఉండడం దర్శించాను. మంగళ స్వరూప గుణులైన రామకృష్ణులు ఎలా ఇక్కడ అక్కడా రెండు చోట్లా కనపడ్డారు. నా మనస్సు ఏమైనా భ్రమ పడిందా? నీళ్ళలో వీళ్ళుండడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకోసారి చూస్తాను” అని తలంచి, తిరిగి నదీజలాలలో మునిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=142&padyam=1231

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: