Thursday, September 17, 2020

శ్రీ కృష్ణ విజయము - 31

( కృష్ణుడు మథురకు చనుట )

10.1-1224-వ.
అంత మఱునాడు సూర్యోదయకాలంబునం దనతోడఁ బయనంబునకు గమకించి నడచు గోపికలను “మరలివత్తు” నని దూతికా ముఖంబున నివర్తించి, కృష్ణుండు శకటంబులందుఁ గానుకలును గోరసంబు నిడికొని నందాదులైన గోపకులు వెనుదగుల నక్రూరచోదితంబైన రథంబెక్కి మథురాభిముఖుండై చను సమయంబున.
10.1-1225-చ.
"అదె చనుచున్నవాఁడు ప్రియుఁ డల్లదె తేరదె వైజయంతి య
ల్లదె రథ ఘోటకాంఘ్రి రజమా దెస మార్గము చూడుఁ" డంచు లో
నొదవెడి మక్కువన్ హరిరథోన్ముఖలై గములై వ్రజాంగనల్
గదలక నిల్చిచూచి రటు కన్నుల కబ్బినయంత దూరమున్.
10.1-1226-వ.
ఇట్లు నక్రూర రామ సహితుండై చని చని.

భావము:
శ్రీకృష్ణుడు మరునాటి ఉదయం తన వెంట వస్తామని సిద్ధపడుతున్న గోపికాస్త్రీలకు “మళ్ళీ వస్తా” నని దూతికల ద్వారా చెప్పించి, వారిని వెనుకకు మరలించాడు. బండ్ల నిండా కానుకలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మున్నగు వాటిని ఎక్కించుకుని నందుడు మొదలుగా గల గోపకులు కూడా వస్తుండగా అక్రూరుడు తోలే రథం ఎక్కి శ్రీకృష్ణుడు మథురానగరం వైపు బయలుదేరి వెళ్తున్నాడు. అప్పుడు అలా మథురకు పయనమై పోతుండగా వ్రేపల్లెలోని వనితలు “అదిగో చూడు. మన ప్రియ కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు. అదిగో రథం. అదిగదిగో రథంమీది జెండా. రథానికి పూన్చిన గఱ్ఱాల పాదధూళి ఎలా లేస్తోందో చూడు. అదిగో అటు వైపే కృష్ణుడు వెళ్తున్నాడు చూడండి” అంటూ కళ్ళకి కనపడినంత దూరం పోయేదాకా కదలక మెదలక అలాగే చూస్తూ నిలబడిపోయారు. అలా పయనమైన బలరామకృష్ణులు అక్రూరుడితో కలసి వెళ్తూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=141&padyam=1225

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: