Friday, September 18, 2020

శ్రీ కృష్ణ విజయము - 32

( కృష్ణుడు మథురకు చనుట )

10.1-1227-క.
అవలోకించెను గృష్ణుఁడు
ప్రవిమలకల్లోలపవన భాసితజన్య
న్నవసన్నపాపసైన్యం
గవిజనమాన్యం గళిందకన్యన్ ధన్యన్.
10.1-1228-వ.
కని, తత్కాళింది యందుఁ బరిక్షుణ్ణ మణిగణ సముజ్జ్వలంబు లగు జలంబులు ద్రావి, తరుసమూహ సమీపంబున రామసహితుండై కృష్ణుండు రథంబు ప్రవేశించె; నంత నక్రూరుండు వారలకు మ్రొక్కి వీడ్కొని కాళిందీహ్రదంబు జొచ్చి విధిపూర్వకంబుగా వేదమంత్రంబులు జపియించుచు.

భావము:
కృష్ణుడు యమునా నదిని దర్శించారు. ఆ యమున నిర్మలమైన తన పెద్ద అలలపై నుంచి చల్లటి గాలులు వీస్తుంది. పాపాలన్నిటినీ నశింపజేస్తుంది. ఆ నదిని పండితులు ఎంతో గౌరవిస్తారు. ఆ యమున కళింద పర్వతం కూతురు. పరమ ధన్యాత్మురాలు. అలా మథుర వెళ్తున్న కృష్ణుడు బలరాముడితో పాటు కాళింది కన్య అయిన యమునను చూసి, బాగా మెరుగు పెట్టిన మణులలా తళతళ మెరుస్తున్న ఆ నదీజలాన్ని త్రాగాడు. పిమ్మట చెట్ల దగ్గర ఆపిన రథాన్ని అధిరోహించాడు. అప్పుడు అక్రూరుడు వారిద్దరికీ నమస్కరించి, వారి అనుమతి తీసుకుని, కాళిందీ మడుగులో దిగి యథావిధిగా వేదమంత్రాలు జపిస్తూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=141&padyam=1228

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: