Saturday, September 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 39

( శ్రీమానినీచోర దండకము )

10.1-1240-వ.
అనిన నతం డిట్లనియె.
10.1-1241-క.
"నీలోన లేని చోద్యము
లే లోకములందుఁ జెప్ప రీశ్వర! నీటన్
నేలన్ నింగిని దిక్కుల;
నీలో చోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!"
10.1-1242-వ.
అని పలికి సాయంకాలంబునకు నక్రూరుండు మథురానగరంబు చేర రథంబు గడపె నంతట నటమున్న చని నందాదులు పురోపవనంబున విడిసి యుండ వారలం గూడుకొని కృష్ణుం డక్రూరునిం జూచి “నీవు రథంబు గొనుచు నగరంబునకుం జనుము మేము వెనుక వచ్చెద” మనిన నతం డిట్లనియె.

భావము:
ఇలా అడిగిన కృష్ణుడితో అక్రూరుడు ఇలా అన్నాడు. “స్వామీ నీలో లేని వింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయని పెద్దలు చెప్పలేదు. ఇక నీటిలో, నేలలో, నింగిలో ఉంటాయా? మహాత్మా! సర్వదిక్కులలోని విచిత్రాలన్నీ నీలోనే ఉన్నాయి కదా.” ఇలా చెప్పి అక్రూరుడు సాయంకాలానికి మధురాపురి చేరేటట్లుగా రథాన్ని నడిపాడు. ముందుగా వెళ్ళిన నందుడు మొదలైనవారు పొలిమేరలోని తోపులో బసచేసి ఉన్నారు. కృష్ణుడు వారిని కలుసుకుని అక్రూరుడిని చూసి “నీవు రథాన్ని తోలుకుని పట్టణానికి వెళ్ళు. మేము తర్వాత వస్తాము” అని చెప్పగా అతడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1241

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :


No comments: