Saturday, May 25, 2019

కపిల దేవహూతి సంవాదం - 22

3-896-వ.
అది యెట్టు లంటేని సామాన్యచింతయు విశేషచింతయు ననందగు సంకల్ప వికల్పంబులం జేసి కామసంభవం బనంబడు నెద్ది, యనిరుద్ధాఖ్యం బయిన వ్యూహం బదియ హృషీకంబులకు నధీశ్వరం బయి సకల యోగీంద్ర సేవ్యం బగుచు శరదిందీవర శ్యామం బయి యుండు; వెండియుం దైజసంబువలన బుద్ధితత్త్వంబు పుట్టె; దాని లక్షణంబులు ద్రవ్యప్రకాశం బైన జ్ఞానంబును, నింద్రియానుగ్రహంబును, సంశయంబును, మిథ్యాజ్ఞానంబును, నిద్రయు, నిశ్చయంబును స్మృతియు ననందగి యుండు; మఱియుఁ దైజసాహంకారంబు వలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులును గ్రియాజ్ఞానసాధనంబులును గలిగి యుండుఁ; బ్రాణంబునకుం గ్రియాశక్తియు బుద్ధికి జ్ఞానశక్తియు నగుటం జేసి యింద్రియంబులకుఁ దైజసత్వంబు గలిగి యుండు; భగద్భక్తి ప్రేరితం బయిన తామసాహంకారంబువలన శబ్ద తన్మాత్రంబు పుట్టె; దానివలన నాకాశంబును నాకాశంబువలన శ్రోత్రింద్రియంబును పుట్టె; శ్రోత్రంబు శబ్దగ్రాహి యయ్యె; శబ్దం బర్థంబునకు నాశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకం బయ్యె మఱియు శబ్దతన్మాత్రంబువలన నాకాశం బయి యా యాకాశంబు భూతంబులకు బాహ్యాభ్యంతరంబుల నవకాశం బిచ్చటయు నాత్మ ప్రాణేంద్రియాదులకు నాశ్రయం బగుటయు నను లక్షణంబులు గలిగి యుండు కాల గతిచే వికారంబు నొందు; శబ్దతన్మాత్ర లక్షణం బగు నభంబువలన స్పర్శంబును స్పర్శంబువలన వాయువును వాయువుచే స్పర్శగ్రాహియైన త్వగింద్రియంబును బుట్టె; మృదుత్వంబును గఠినత్వంబును శైత్యంబును నుష్ణత్వంబును నను నివి స్పర్శంబునకు స్పర్శత్వం బని చెప్పంబడు; మఱియు వాయువునకుఁ జాలనంబును పరస్పర విభాగకరణంబును దన్మేళనంబును ద్రవ్యశబ్దనేతృత్వంబు నగు; అందు గంధవంతం బగు ద్రవ్యంబును ఘ్రాణేద్రియంబు నొందించుట ద్రవ్యనేతృత్వంబు దూరస్థం బగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్య మగు; నట్లొనరించుట శబ్దనేతృత్వంబు సర్వేంద్రియాత్మకత్వంబు ననునవి లక్షణంబులై యుండు; దైవప్రేరితంబై స్పర్శ తన్మాత్ర గుణకం బగు వాయువువలన రూపంబును దానివలనఁ దేజంబును బుట్టె; రూపంబు నేత్రేంద్రియ గ్రాహకం బయ్యె నేత్రగతం బయిన రూపంబునకు నుపలంభకత్వంబును ద్రవ్యాకారసమత్వంబును ద్రవ్యంబునకు నుపసర్జనం బగుటయు ద్రవ్యపరిణామ ప్రతీతియు నివి రూపవృత్తు లనంబడు; తైజసంబునకు సాధారణంబు లగు ధర్మంబులు ద్యోతం బనఁ బ్రకాశంబు పచనం బనఁ దండులాదుల పాకంబు పిపాసా నిమిత్తం బైన పానంబు క్షున్నిమిత్తం బైన యోదనంబు హిమమర్దనం బగు శోషణంబు ననునివి వృత్తులై యుండు; రూపతన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబు నొందు తేజస్సు వలన రసతన్మాత్రంబు పుట్టె; రసతన్మాత్రంబువలన జలంబు పుట్టె; జిహ్వ యను రసనేంద్రియంబు రసగ్రాహకం బయ్యె; ఆ రసం బేకంబై యుండియు భూతవికారంబునం జేసి కషాయ తిక్త కట్వామ్ల మధురాది భేదంబుల ననేక విధం బయ్యె; వెండియు సాంసర్గిక ద్రవ్యవికారంబునంజేసి యార్ద్రం బగుటయు ముద్దగట్టుటయుఁ దృప్తి దాతృత్వంబును జీవంబును దద్వైక్లబ్య నివర్తనంబును మృదూకరణంబును దాపనివారణంబును గూపగతం బయిన జలంబు దివియ మఱియు నుద్గమించుటయు ననునివి జలవృత్తు లనంబడు; రసతన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబునం బొందిన జలంబు వలన గంధతన్మాత్రంబు పుట్టె; దానివలనం బృథ్వియు గలిగె ఘ్రాణంబు గంధగ్రాహకం బయ్యె; అందు గంధం బేకం బయ్యు వ్యంజనాదిగతం బయి హింగ్వాది నిమిత్తం బయిన మిశ్రమగంధంబును కరంభంబును గృంజనాదిగతం బయిన పూతిగంధంబును; ఘనసారాది నిమిత్తం బయిన సుగంధంబును శతపత్రాదిగతం బగు శాంత గంధంబును లశునాదిగతం బైన యుగ్రగంధంబును బరుష్యిత చిత్రాన్నాది గతం బయిన యామ్లగంధంబును ద్రవ్యావయవ వైషమ్యంబునం జేసి యనేకవిధంబై యుండు; అదియునుం గాక ప్రతిమాదిరూపంబులం జేసి సాకారతాపాదనం బగు భావంబును, జలాది విలక్షణ త్రయాంతర నిరపేక్షం బయిన స్థితియు జలాధ్యాధారత యను ధారణంబును, నాకాశాద్యవచ్ఛేదకత్వంబును, సకలప్రాణి పుంస్త్వాభి వ్యక్తీకరణంబును ననునివి పృథ్వీవృత్తు లనంబడు" అని చెప్పి వెండియు నిట్లనియె "నభో సాధారణగుణ శబ్దవిశేషగ్రాహకంబు శ్రోత్రంబును, వాయ్వ సాధారణగుణ విశేషగ్రాహకంబు స్పర్శంబును, దేజో సాధారణగుణ విశేషగ్రాహకంబు చక్షురింద్రియంబును, నంభో సాధారణగుణ విశేషగ్రాహకంబు రసనేంద్రియంబును, భూమ్య సాధారణగుణ విశేషగ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును, నాకాశాది గుణంబులగుచు శబ్దాదికార్యంబు లగు వాయ్వాదు లందుఁ గారణాన్వయంబు ననన్నిఁటికిం బృథ్వీ సంబంధంబు గలుగుటంజేసి భూమి యందు శబ్దస్పర్శరూపరసగంధంబులు గలుగుట మహదాదిపృథివ్యంతంబు లగు నీ యేడు తత్త్వంబులు పరస్పర మిళితంబు లై భోగాయతనం బగు పురుషునిం గల్పింప సమర్థంబులై యున్నం జూచి కాలాదృష్టసత్వాదులం గూడి జగత్కారణుండును ద్రైగుణ్యవిశిష్టుండును నశేష నియామకుండును నిరంజనాకారుండును నగు సర్వే శ్వరుం డందు బ్రవేశించు; అంత నన్యోన్యక్షుబితంబు లై మిళితంబు లైన మహదాదుల వలన నధిష్ఠాతృచేతన రహితం బగు నొక యండంబు పుట్టె; అందు.

భావము:
అది ఎలాగంటే ఈ మనస్తత్త్వానికి చింతనం సహజం. ఆ చింతనం సామాన్య చింతనం, విశేష చింతనం అని రెండు విధాలు. వీనినే క్రమంగా సంకల్పం, వికల్పం అని పేర్లు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరువేరు లక్షణాలతో మనకు కనిపిస్తాయి. వీనివల్లనే వివిధ కామాలు ఉత్పన్నమౌతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహం అని చెప్పబడుతుంది. ఇక అనిరుద్ధ వ్యూహం సంగతి చెబుతాను. ఇదే ఇంద్రియాలన్నిటికి అధీశ్వరమై, యోగీంద్రు లందరకు సంసేవ్యమై, శరత్కాల మందలి నల్లకలువ వలె శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది. తైజసాహంకారం వల్ల బుద్ధితత్త్వం పుట్టింది. ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, ఇంద్రియానుగ్రహం, సంశయం, మిథ్యాజ్ఞానం, నిద్ర, నిశ్చయం, స్మృతి అనేవి బుద్ధితత్త్వ లక్షణాలు. ఈ తైజసాహంకారం వల్లనే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడుతాయి. ఈ తైజసాహంకారం వల్లనే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ రెండు శక్తులూ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తాయి. భగవద్భక్తివల్ల ప్రేరేపించబడిన తామసాహంకారంనుండి శబ్దతన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రంనుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం (చెవి) పుట్టింది. శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది. అదే శబ్దం అర్థానికి ఆశ్రయమై శబ్దం వినేవానికి జ్ఞానజనకం అవుతున్నది. ఈ శబ్దతన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది. ఈ ఆకాశం సకల జీవులకు లోపల వెలుపల అవకాశం ఈయటమే కాక ఆత్మకూ, ప్రాణాలకూ, ఇంద్రియాలకూ ఆశ్రయంగా ఉంటుంది. కాలగమనం వల్ల మార్పు చెందే శబ్దతన్మాత్ర లక్షణమైన ఆకాశం వల్ల స్పర్శమూ, స్పర్శంవల్ల వాయువూ, ఆ వాయువువల్ల స్పర్శను గ్రహించగల చర్మమూ పుట్టి స్పర్శజ్ఞానాన్ని కలిగించింది. మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం ఇవి స్పర్శజ్ఞానానికి లక్షణాలు. వాయువునకు కదలుట, కదలించుట, వేరుచేయుట, కలుపుట, ద్రవ్యనేతృత్వం, శబ్దనేతృత్వం, సర్వేంద్రియాత్మకత్వం అనేవి లక్షణాలు. గంధంతో కూడిన ద్రవ్యాలను ఆఘ్రాణింపజేయటం ద్రవ్యనేతృత్వం. దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింప జేయటం శబ్దనేతృత్వం. భగవత్ప్రేరణతో స్పర్శతన్మాత్రం వల్ల పుట్టిన వాయువువల్ల రూపం పుట్టింది.ఈ రూపం వలన తేజస్సు కలిగింది. నేత్రేంద్రియం వల్ల గ్రహింపదగింది రూపం. నేత్రాన్ని పొందిన రూపానికి అనగా కనుపించునటువంటి ఆకారానికి వృత్తులు ఉపలంభకత్వం (అనుభవం కలుగడం), ద్రవ్యాకారసమత్వం (ద్రవ్యంయొక్క ఆకారాన్ని ఉన్నదున్నట్లుగా చూపడం), ద్రవ్యోపసర్జనం (ద్రవ్యం అప్రధానం కావడం), ద్రవ్యపరిణామ ప్రతీతి (ద్రవ్యంయొక్క మార్పు తెలియడం). ఇక తేజస్సుకు సాధారణాలైన ధర్మాలు ద్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి. ద్యోతానికి ప్రకాశం, పచనానికి బియ్యం మొదలైన పాకం, పిపాసకు పానం, ఆకలికి ఆహారం, చలికి శోషణం అనేవి వృత్తులు. దైవప్రేరితమై మార్పు చెందిన తేజస్సువల్ల రసతన్మాత్రం పుట్టింది. ఈ రసతన్మాత్ర వల్ల జలం పుట్టింది. జిహ్వ అనే పేరుగల రసనేంద్రియం రసాన్ని గ్రహించేది అయింది. ఆ రసం ఒకటే అయినా ద్రవ్యాల కలయికలోని మార్పువల్ల వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనే రుచులుగా మారి వాటి కలయిక వల్ల ఇంకా అనేకవిధాలుగా మార్పు చెందింది. తనలో చేరిన ద్రవ్యాల మార్పులనుబట్టి ఆర్ద్రం కావడం, ముద్ద గట్టడం, తృప్తినివ్వడం, జీవనం, అందలి మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జలలు ఏర్పడి అడుగున ఉన్న జలం పైకెగయడం అనేవి ఈ జలవృత్తులు. రసతన్మాత్రవల్ల దైవప్రేరణతో మార్పుచెందిన జలంనుండి గంధతన్మాత్రం పుట్టింది. ఈ గంధతన్మాత్రం వలన పృథ్వి (భూమి) ఏర్పడింది. ఘ్రాణేంద్రియం (ముక్కు) గంధాన్ని గ్రహించేదయింది. ఈ గంధం ఒకటే అయినా ఇంగువ మొదలైన పదార్థాలతో కలిసిన కారణంగా మిశ్రమగంధం అనీ, నిలువ ఉన్న పెరుగు ముద్ద, జంతుమాంసం మొదలైన వానితో కలిసినప్పుడు దుర్గంధం అనీ, కర్పూరం మొదలైనవానితో కలిసినపుడు సుగంధం అనీ, తామరపూలు మొదలైన వానితో కలిసినపుడు శాంతగంధం అనీ, వెల్లుల్లి మొదలైన వానితో కలిసినపుడు ఉగ్రగంధం అనీ, పాసిపోయిన చిత్రాన్నం వంటి వాటితో కలిసినపుడు ఆమ్లగంధం అనీ వేరువేరు పదార్థాలతో కలిసినపుడు మరెన్నో విధాలుగా పేర్కొనబడుతుంది. భూమికి సంబంధించిన సాధారణ ధర్మాలు ఏవనగా ప్రతిమల రూపాన్నీ వాటి ఆకారాలనూ నిలుపుకోవడం, జలం మొదలైన వాటితో అవసరం లేకుండా స్వతంత్రంగా నిలబడగలగటం, జలాదులకు తాను ఆధారమై ఉండటం, ఆకాశం, వాయువు, తేజస్సు, బలం వీనిని విభజించడం, సకల జీవరాసులకు దేహంగా పనిచేయటం అనేవి పృథ్వీవృత్తులు” అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు. “పంచభూతాలకు సాధారణ ధర్మాలు విన్నావు. ఇవికాక వానికి సంబంధించిన అసాధారణ ధర్మాలు విను. ఆకాశానికి అసాధారణగుణం శబ్దం. దీనిని శ్రవణేంద్రియం గ్రహిస్తుంది. వాయువుకు అసాధారణగుణం స్పర్శం. దీనిని త్వగింద్రియం గ్రహిస్తుంది. తేజస్సుకు అసాధారణగుణం రూపం. దీనిని నేత్రేంద్రియం గ్రహిస్తుంది. జలానికి అసాధారణగుణం రసం. దీనిని జిహ్వేంద్రియం గ్రహిస్తుంది. పృథివికి అసాధారణగుణం గంధం. దీనిని ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది. ఆకాశం మొదలైన అన్నింటితో సంబంధం ఉండడం వల్ల భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అసాధారణ గుణాలు అయినాయి. మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అనే ఈ ఏడు తత్త్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైన పురుషుని కల్పించటానికి అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడూ అంతుపట్టని అస్తిత్వం కలవాడూ, జగత్కారణుడూ, సత్త్వరజస్తమోగుణాలకు అతీతుడూ, సమస్తాన్ని నియమించేవాడూ, నిరంజనాకారుడూ అయిన సర్వేశ్వరుడు పైన చెప్పబడిన పురుషునిలో ప్రవేశించాడు. అప్పుడు ఒకదానితో ఒకటి కలగాపులగమై ఘర్షణ పొంది కలిసిపోయిన మహదాదుల వలన అధిష్ఠాతయైన భగవంతుని చైతన్యం కోల్పోయిన ఒక అండం పుట్టింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=47&padyam=896

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: