Tuesday, June 1, 2021

శ్రీకృష్ణ విజయము - 244

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-227-వ.
అంత నొక్కనాఁడు రుక్మిణీదేవి లోఁగిట మహేంద్రనీల మరకతాది మణిస్తంభ వలభి విటంకపటల దేహళీకవాట విరాజమానంబును, శాతకుంభ కుడ్య గవాక్ష వేదికా సోపానంబును, విలంబమాన ముక్తాఫలదామ విచిత్ర కౌశేయవితానంబును, వివిధ మణిదీపికా విసర విభ్రాజమానంబును, మధుకరకులకలిత మల్లికాకుసుమ మాలికాభిరామంబును, జాలకరంధ్ర వినిర్గత కర్పూరాగరుధూప ధూమంబును, వాతాయన విప్రకీర్ణ శిశిరకర కిరణస్తోమంబును, బారిజాతప్రసవామోద పరిమిళితపవనసుందరంబు నయిన లోపలిమందిరంబున శరచ్చంద్రచంద్రికా ధవళపర్యంక మధ్యంబున, జగదీశ్వరుం డయిన హరి సుఖాసీనుండై యుండ, సఖీజనంబులుం దానును డగ్గఱి కొలిచి యుండి.

భావము:
ఒకనాడు రుక్మిణీదేవి అంతఃపురంలో శరత్కాలపు వెన్నెలవంటి తెల్లనైన పానుపుమీద జగదీశ్వరు డైన శ్రీకృష్ణుడు సుఖాసీనుడై ఉన్నాడు. ఆ అంతఃపురం నవరత్నాలు పొదిగిన స్తంభాలతో ఇంద్రనీల మణులు పొదిగిన చంద్రశిలలతో నిండినట్టిది. ఆ చంద్రశాలలలోని ద్వారబంధాలు గడపలు మండపాలు తలుపులు గోడలు కిటికీలు అరుగులు మెట్లు అన్నీ సువర్ణకాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ అంతఃపురం వేల్లాడుతున్న ముత్యాలసరాలతో నిండిన చిత్రవిచిత్రమైన పట్టువస్త్రాల చాందినీలతో వెలుగుతున్నది అనేక మణిదీపాలతో ప్రకాశిస్తున్నది. అక్కడ ఉన్న మల్లెపూలదండలపై తుమ్మెదలు మూగి ఉన్నాయి. కర్పూరం అగరు మొదలైన సుగంధ ద్రవ్యాల పొగలు ఆ అంతఃపురపు కిటికీలగుండా బయటకు వ్యాపిస్తున్నాయి. గవాక్షాల గుండా చల్లని తెల్లని కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఉద్యానవనం నుంచి పారిజాత సుగంధ పవనాలు వీస్తున్నాయి. అటువంటి అంతఃపురంలో సుఖాసీనుడై ఉన్న శ్రీహరిని రుక్మిణీదేవి ఆమె సఖులూ సేవిస్తున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=227

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: