Wednesday, June 9, 2021

శ్రీకృష్ణ విజయము - 252

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-243-క.
మురసంహరుఁ డిందిందిర
గరుదనిలచలత్ప్రసూనకలికాంచిత సుం
దరశయ్యఁ జేర్చె భీష్మక
వరపుత్రిన్ నుతచరిత్ర వారిజనేత్రన్.
10.2-244-వ.
ఇట్లు పానుపునం జేర్చి మృదుమధుర భాషణంబుల ననునయించిన.
10.2-245-క.
పురుషోత్తము ముఖకోమల
సరసిజ మయ్యిందువదన సవ్రీడా హా
సరుచిస్నిగ్ధాపాంగ
స్ఫుర దవలోకనము లొలయఁ జూ చిట్లనియెన్.

భావము:
మురాసురుని సంహరించినవాడు, శ్రీకృష్ణుడు శీలవతీ కమలలోచన, భీష్మకుని ఇంట అవతరించిన సాక్షాత్తు లక్ష్మీదేవీ అయిన రుక్మిణిని తుమ్మెదల రెక్కల గాలికి కదులుతున్న పూలతో కూడిన అందమైన పాన్పు పైకి చేర్చాడు. ఈ విధంగా పాన్పుపైచేర్చి మనోహరమైన మధురవాక్కులతో ఊరడించగా చంద్రబింబం వంటి మోము కల ఆ రుక్మిణీదేవి పురుషోత్తముని అందమైన ముఖారవిందాన్ని సిగ్గు తోకూడిన స్నిగ్ధమైన చూపులతో చూస్తూ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=245

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: