Tuesday, June 1, 2021

శ్రీకృష్ణ విజయము - 245

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-228-సీ.
కుచకుంభములమీఁది కుంకుమతో రాయు-
  హారంబు లరుణంబు లగుచు మెఱయఁ;
గరపల్లవము సాఁచి కదలింప నంగుళీ-
  యక కంకణప్రభ లావరింపఁ;
గదలిన బహురత్న కలిత నూపురముల-
  గంభీర నినదంబు గడలుకొనఁగఁ;
గాంచన మణికర్ణికా మయూఖంబులు-
  గండపాలికలపై గంతు లిడఁగఁ;
10.2-228.1-తే.
గురులు నర్తింపఁ బయ్యెద కొంగు దూఁగ;
బోటిచే నున్న చామరఁ బుచ్చుకొనుచు
జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి
వేడ్క లిగురొత్త మెల్లన వీవఁ దొడఁగె.

భావము:
ఆ సమయంలో వక్షస్థలంమీది కుంకుమ అంటుకుని హారాలు ఎఱ్ఱని కాంతితో మెరుస్తుండగా; చిగురుటాకువంటి చేతిని కదలించి నప్పుడు కదలిన కంకణాలు, ఉంగరాల కాంతులు ప్రసరిస్తుండగా; చెవులకు ధరించిన బంగారు చెవిదుద్దుల ధగధగలు గండస్థలాలపై వ్యాపిస్తుండగా; కదిలినప్పుడు రత్నాల అందెలు గంభీరమైన ధ్వని చేస్తుండగా; ముఖం మీద ముంగురులు కదలాడుతుండగా; పైటకొంగు తూగాడుతూ ఉండగా; చెలికత్తె చేతిలోని వింజామరను తీసుకుని రుక్మిణీదేవి తన జీవితేశ్వరు డైన శ్రీకృష్ణునకు మెల్లిగా విసరసాగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=228

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: