Sunday, June 27, 2021

శ్రీకృష్ణ విజయము - 268

( కృష్ణ కుమారోత్పత్తి )

10.2-276-చ.
అనఘ! పదాఱువేల సతులందు జనించిరి వేఱువేఱ నం
దన దశకంబు తత్సుత వితానము గాంచి రనేక సూనుల
న్నెనయఁగ నిట్లు పిల్లచెఱ కీనిన కైవడిఁ బుత్త్ర పౌత్త్ర వ
ర్ధనమున నొప్పెఁ గృష్ణుఁడు ముదంబునఁ దామరతంపరై భువిన్.
10.2-277-తే.
అట్లు యదు వృష్ణి భోజాంధకాది వివిధ
నామధేయాంతరముల నెన్నంగ నూట
యొక్కటై చాల వర్ధిల్లె నక్కులంబు
నృపకుమారులఁ జదివించు నేర్పు గలుగు.
10.2-278-తే.
గురుజనంబులు విను మూఁడుకోట్లమీఁద
నెనుబదెనిమిదివేలపై నెసఁగ నూర్వు
రన్నఁ దద్బాలకావలి నెన్నఁదరమె
శూలికైనను దామరచూలికైన?

భావము:
శ్రీకృష్ణుడికి పదహారువేలమంది భార్యలలో ఒక్కొక్కరికి పదిమంది వంతున పుత్రులు ఉద్భవించారు ఆ పుత్రులు అందరికీ మళ్ళీ కుమారులు కలిగారు. ఈ విధంగా పిల్లచెఱకుకు పిలకలు పుట్టినట్లు తామరతంపరగా విలసిల్లిన పుత్రపౌత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు. ఈ విధంగా యాదవ వృష్టి భోజ అంధక మొదలైన నూట ఒక్క పేర్లతో ఆ కులం వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు విద్యనేర్పడం కోసమే గురువర్యులే మూడుకోట్ల ఎనభైవేల ఒకవంద మంది ఉన్నారంటే, ఇక ఆ రాజకుమారుల సంఖ్యలు వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా పరమేశ్వరుడికైనా సాధ్యం కాదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=28&Padyam=278

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :



No comments: