Saturday, June 5, 2021

శ్రీకృష్ణ విజయము - 249

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-236-వ.
అని యిట్లు భగవంతుడైన హరి దన్నుఁ బాయక సేవించుటం బ్రియురాలను, పట్టంపుదేవి ననియెడి రుక్మిణి దర్పంబు నేర్పున నుపసంహరించి యూరకుండిన నమ్మానవతి యప్రియంబులు నపూర్వంబులు నైన మనోవల్లభు మాటలు విని దురంతంబైన చింతాభరంబున సంతాపంబు నొందుచు.
10.2-237-సీ.
కాటుక నెఱయంగఁ గన్నీరు వరదలై-
  కుచకుంభయుగళ కుంకుమము దడియ
విడువక వెడలెడు వేఁడినిట్టూర్పుల-
  లాలితాధర కిసలయము గందఁ
జెలువంబు నెఱిదప్పి చిన్నఁవోవుచు నున్న-
  వదనారవిందంబు వాడు దోఁప
మారుతాహతిఁ దూలు మహిత కల్పకవల్లి-
  వడువున మేన్ వడవడ వడంకఁ
10.2-237.1-తే.
జిత్త మెఱియంగఁ జెక్కిటఁ జేయ్యి సేర్చి
కౌతుకం బేది పదతలాగ్రమున నేల
వ్రాసి పెంపుచు మో మరవాంచి వగలఁ
బొందె మవ్వంబు గందిన పువ్వుఁబోలె.

భావము:
అని భగవంతుడైన శ్రీకృష్ణుడు పలికాడు. ప్రతినిత్యం తనను సేవిస్తూ, పట్టపురాణిని అనే గర్వంతో ఉన్న రుక్మిణి ఆత్మాభిమానం అంతా అలా నేర్పుగా పలికి తొలగించాడు. తన ప్రాణప్రియుని నోట ఆ మానవతి ఇంతకు ముందు ఎన్నడూ వినని అప్రియమైన మాటలు విని, అంతులేని ఆవేదనతో బాధపడింది.
కాటుకతో నిండిన కన్నీ టిధారలు కుచ కుంభముల మీది కుంకుమను తడిపివేశాయి. ఆగకుండా వస్తున్న వేడినిట్టూర్పుల వలన, చిగురుటాకు వంటి అందమైన పెదవి కందిపోయింది. ముఖపద్మం కళ కోల్పోయి వాడిపోయింది. గాలితాకిడికి తూలిపోతున్న కల్పవల్లి వలె నెమ్మేను వడ వడ కంపించింది, ఈవిధంగా రుక్మిణి మనస్సు బాధపడుతుండగా, చెక్కిలిపై చేయిచేర్చి దీనంగా కాలితో నేలను రాస్తూ, ముఖం వంచుకుని, సౌకుమార్యం కోల్పోయిన పూవులాగా వ్యాకులపాటు చెందింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=237

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: