Sunday, September 2, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 6

10.1-439-క.
వత్సముల పగిది జగముల
వత్సలతన్ మనుపఁ జూచువాఁడై యుంటన్
వత్సముల మేపు చుండియు
వత్సాసురుఁ జంపె భక్తవత్సలుఁ డధిపా!
10.1-440-వ.
మఱియు నొక్కనాడు రేపకడ గోపకుమారులు క్రేపులం గొంచు నడవికిం జని యెండంబడి మెండుకొనిన దప్పిని బెండుపడిన తమ తమ లేఁగకదుపుల నేర్పరించి నిలువరించుకొని కలంకంబు లేని యొక్క కొలంకున నీరు ద్రావించి తారును జలపానంబు జేసి వచ్చునెడ నందు. 

భావము:
పరీక్షిన్మహారాజా! ఆవు తన దూడను రక్షించు నట్లు ఈ లోకాలు అన్నింటిని వాత్సల్యభావంతో రక్షించడానికి అవతరించాడు. కనుక భక్తులను కన్నబిడ్డలవలె కాపాడే కృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వత్సాసురుణ్ణి చంపివేసాడు. దినము ఉదయమే గోపబాలకులు వారి లేగదూడలను అడవికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎండకు గురై విపరీతమైన దాహము కలుగగా, అలసిపోయిన వారి లేగదూడలను వారిలో వారు విభజించుకొని ఒక మంచినీటి కొలనులో వాటి చేత నీరు తాగించి వారు కూడా నీరు తాగి వస్తున్న సమయంలో ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=62&padyam=439

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: