Sunday, September 30, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 25

10.1-476-శా.
వేల్పుల్ చూచి భయంబు నొంద గ్రసనావేశంబుతో నుజ్జ్వల
త్కల్పాంతోజ్జ్వలమాన జిహ్వ దహనాకారంబుతో మ్రింగె న
స్వల్పాహీంద్రము మాధవార్పిత మనోవ్యాపార సంచారులన్
యల్పాకారుల శిక్యభారులఁ గుమారాభీరులన్ ధీరులన్.
10.1-477-వ.
ఇట్లు పెనుబాముచేత మ్రింగుడుపడు సంగడికాండ్ర గమిం జూచి కృష్ణుండు.


భావము:
అప్పుడు అఘాసురుడు వారిని అందరినీ మ్రింగేసే ఆవేశంతో నోరు ఒక్కసారిగా అప్పళించాడు. ప్రళయ కాలంలో భగ్గున జ్వలించే భయంకర జ్వాలలవలె మంటలు మండుతున్న తన నాలుకతో వారిని అందరినీ నోటి లోనికి లాక్కుని మ్రింగేశాడు. దేవతలు అందరూ ఆ మహాసర్పం వారిని మ్రింగడం చూసి భయపడిపోయారు. ఆ గొల్లపిల్లలు మనస్సులు ఎప్పుడూ కృష్ణుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వారు శారీరకంగా బలవంతులు కారు. చిన్నపిల్లలు తాము మోస్తున్న చిక్కములు కూడా వారికి బరువే. అయినా ఆ గోపకుమారులు కృష్ణునికి తమను తాము సమర్పించుకున్నవారు కనుక చాలా ధైర్యం ఉన్నారు. తన మిత్రులు అందరూ అలా ఆ భయంకర సర్పం చేత మ్రింగబడుతూ ఉండడం చూసి, కృష్ణుడు తనలో తాను ఇలా అనుకున్నాడు



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: