Sunday, May 30, 2021

శ్రీకృష్ణ విజయము - 242

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-223-సీ.
ఇంటికి వచ్చిన నెదురేగుదెంచుచు-
  నానీత వస్తువులందుకొనుచు
సౌవర్ణమణిమయాసనములు వెట్టుచుఁ-
  బదములు గడుగుచు భక్తితోడ
సంవాసితస్నానజలము లందించుచు-
  సద్గంధవస్త్రభూషణము లొసఁగి
యిష్ట పదార్థంబు లిడుచుఁ దాంబూ లాదు-
  లొసఁగుచు విసరుచు నోజ మెఱసి
10.2-223.1-తే.
శిరము దువ్వుచు శయ్యపైఁ జెలువు మిగుల
నడుగు లొత్తుచు దాసీసహస్రయుక్త
లయ్యుఁ గొలిచిరి దాసులై హరి నుదారుఁ
దారకాధిప వదనలు దారు దగిలి.
10.2-224-శా.
నన్నే పాయఁడు; రాత్రులన్ దివములన్ నన్నే కృపం జెందెడిన్;
నన్నే దొడ్డగఁ జూచు వల్లభలలో నాథుండు నా యింటనే
యున్నా డంచుఁ బదాఱువేలుఁ దమలో నూహించి సేవించి రా
యన్నుల్‌ గాఢ పతివ్రతాత్వ పరిచర్యా భక్తియోగంబులన్.

భావము:
ఇంటికి రాగానే ఎదురువెళ్ళి తెచ్చిన వస్తువులు అందుకుంటారు. మణులతో పొదిగిన బంగారు ఆసనాలు వేస్తారు. భక్తితో పాదాలు కడుగుతారు, స్నానానికి సుగంధంతో కలిపిన నీళ్ళను అందిస్తారు. సుగంధాలు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పిస్తారు. ఇష్టమైన పదార్ధాలు వడ్డిస్తారు. తాంబూలం అందిస్తూ, విసురుతూ, తల దువ్వుతూ, పాదాలు ఒత్తుతూ, వేలకొలది దాసీలు ఉన్నప్పటికీ ఆ చంద్రముఖులు చేసే సేవలు అన్నీ వాసుదేవుడికి స్వయంగా తామే చేస్తారు. “శ్రీకృష్ణుడు రాత్రింబవళ్ళు నాచెంతనే ఉంటూ నన్నే ప్రేమిస్తున్నా”డని తమలో తాము సంబరపడుతూ, ఆ పదహారువేలమంది పడతులు గొప్ప భక్తి భావంతో, పాతివ్రత్యంతో యదువల్లభుడిని ఆదరాభిమానములతో ఆరాధించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=223

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: