Monday, May 24, 2021

శ్రీకృష్ణ విజయము - 237

( కన్యలంబదాఱువేలందెచ్చుట )

10.2-214-వ.
ఇట్లు బహువిధంబులం దమతమ మన్ననలకు నువ్విళ్ళూరు కన్నియలం బదాఱువేల ధవళాంబరాభరణ మాల్యానులేపనంబు లొసంగి, యందలంబుల నిడి, వారలను నరకాసుర భాండాగారంబులం గల నానావిధంబు లయిన మహాధనంబులను, రథంబులను, దురంగంబులను, ధవళంబులై వేగవంతంబులై యైరావతకుల సంభవంబులైన చతుర్దంత దంతావళంబులను, ద్వారకానగరంబునకుం బనిచి; దేవేంద్రుని పురంబునకుం జని యదితిదేవి మందిరంబు సొచ్చి, యా పెద్దమ్మకు ముద్దు సూపి, మణికిరణ పటల పరిభావితభానుమండలంబులైన కుండలంబు లొసంగి, శచీసమేతుండైన మహేంద్రునిచేత సత్యభామతోడం బూజితుండై, పిదప సత్యభామ కోరిన నందనవనంబు సొచ్చి.

భావము:
ఈ మాదిరిగా తన ఆదరణ కోసం ఉవ్విళ్ళూరుతున్న ఆ కన్యలు అందరకూ తెల్లని చీరలను, ఆభరణాలనూ, పూమాలలనూ, సుగంధ మైపూతలనూ శ్రీకృష్ణుడు ఇచ్చాడు; నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలనూ, రథాలనూ, అశ్వాలనూ, అమితమైన వేగం కలిగిన ఐరావత కులంలో ఉద్భవించిన తెల్లని నాలుగు దంతాల ఏనుగులనూ, ద్వారకానగరానికి పంపించాడు. ఆ పదారువేలమంది స్త్రీలనూ పల్లకీలలో ఎక్కించి ద్వారకకు సాగనంపాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేవేంద్రుని పట్టణ మైన అమరావతికి వెళ్ళాడు. దేవమాత అదితి అంతఃపురానికి వెళ్ళి ఆమె ప్రేమను చూరగొని తమ కాంతులతో సూర్యమండలాన్ని తిరస్కరిస్తున్న ఆమె మణికుండలాలను ఆమెకు సమర్పించాడు. శచీదేవీ దేవేంద్రుల చేత సత్యభామ సమేతంగా పూజలు అందుకున్నాడు. తర్వాత సత్యభామ నందనవనం వెళ్దామని కోరింది. ఆమెను ఆ వనానికి తీసుకొని వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=22&Padyam=214

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: