Friday, May 28, 2021

శ్రీకృష్ణ విజయము - 238

( పారిజాతాపహరణంబు )

10.2-215-మ.
హరి కేలం బెకలించి తెచ్చి భుజగేంద్రారాతిపైఁ బెట్టె సుం
దరగంధానుగతభ్రమద్భ్రమరనాదవ్రాతముం బల్లవాం
కుర శాఖా ఫల పర్ణ పుష్ప కలికా గుచ్ఛాది కోపేతమున్
గిరిభిత్త్రాతముఁ బారిజాతముఁ ద్రిలోకీయాచకాఖ్యాతమున్.
10.2-216-వ.
ఇట్లు పారిజాతంబును హరించి యదువల్లభుండు వల్లభయుం దానును విహగవల్లభారూఢుండై చనుచున్న సమయంబున.

భావము:
అక్కడ పర్వతాల గర్వాలు అణిచిన ఆ ఇంద్రుడు అంతవానిచే పోషింపబడుతున్న పారిజాతవృక్షాన్ని చూసారు. ముల్లోకాల ప్రజల కోరికలుతీర్చడంలో మిక్కిలి ప్రసిద్ధమైనది ఆ దేవతా తరువు. మనోజ్ఞమైన దాని పరిమళాలకు దరిచేరి చక్కర్లు తిరుగుతున్న తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. చిగుళ్ళు, అంకురాలు, మొగ్గలు, గుచ్ఛాలు, కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు మున్నగువాటితో నిండుగా ఉన్నది. ఆ పారిజాతాన్ని అలాగే చేతితో పెకలించి గరుత్మంతుడి మీద పెట్టాడు. శ్రీకృష్ణుడు ఇలా పారిజాతాన్ని అపహరించి తన ప్రాణసతి అయిన సత్యవతీదేవితోపాటు పక్షీంద్రుడు గరుత్మంతుడుపై ఎక్కి బయలుదేరుతున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=23&Padyam=215

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: