Friday, May 21, 2021

శ్రీకృష్ణ విజయము - 234

( కన్యలంబదాఱువేలందెచ్చుట )

10.2-208-వ.
కని యతని సౌందర్య గాంభీర్య చాతుర్యాది గుణంబులకు మోహించి, తమకంబులు జనియింప, ధైర్యంబులు సాలించి, సిగ్గులు వర్జించి, పంచశరసంచలిత హృదయలై, దైవయోగంబునం బరాయత్తంబులైన చిత్తంబుల నమ్మత్తకాశినులు దత్తరంబున మనోజుండుత్తలపెట్ట నతండు దమకుఁ బ్రాణవల్లభుండని వరియించి.
10.2-209-ఉ.
"పాపపురక్కసుండు సెఱపట్టె నటంచుఁ దలంతుఁ మెప్పుడుం
బాపుఁడె? వాని ధర్మమునఁ బద్మదళాక్షునిఁ గంటి మమ్మ! ము
న్నీ పురుషోత్తముం గదియ నేమి వ్రతంబులు సేసినారమో?
యా పరమేష్ఠి పుణ్యుఁడుగదమ్మ! హరిన్ మముఁ గూర్చె నిచ్చటన్

భావము:
అలా చూసి శ్రీకృష్ణుని సౌందర్యం, చాతుర్యం, గాంభీర్యం మున్నగు సుగుణాలకు ఆకర్షితలై మోహించారు. వలపులు పొంగి ధైర్యం కోల్పోయి సిగ్గులు వదలి శృంగార భంగిమలతో సంచలించిన హృదయాలతో పంచబాణుడు తొందరపెట్టగా ఆ రాచకన్నెలు అతడే తమ ప్రాణవల్లభు డని వరించారు. “పాపాత్ముడైన రాక్షసుడు మనల్ని చెరపట్టాడని ఎప్పుడూ భావిస్తుండేవాళ్ళం. వాడిధర్మాన పద్మాక్షుని దర్శించాం. ఈ పురుషోత్తముని దగ్గర చేరడానికి మనం పూర్వజన్మలో ఏ వ్రతాలు చేశామో? శ్రీకృష్ణునితో మనలను జతకూర్చిన ఆ బ్రహ్మదేవుడు ఎంత పుణ్యాత్ముడో? కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=22&Padyam=209

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: