Thursday, May 13, 2021

శ్రీకృష్ణ విజయము - 225

( నరకాసురుని వధించుట )

10.2-186-వ.
అయ్యవసరంబునం గంససంహారి మనోహారిణిం జూచి సంతోషకారియుం, గరుణారసావలోకన ప్రసారియు, మధురవచన సుధారస విసారియుం, దదీయ సమరసన్నాహ నివారియునై యిట్లనియె.
10.2-187-క.
"కొమ్మా! దానవ నాథుని
కొమ్మాహవమునకుఁ దొలఁగె గురువిజయముఁ గై
కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ
గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్. "

భావము:
అలా దానవ సైన్యంపై విజయం సాధించగా కంసుని సంహరించిన వాని మనసును దోచిన వీరనారి సత్యభామను చూసి కృష్ణుడు సంతోషం ఉప్పొంగేలా, కరుణాకటాక్ష వీక్షణలు వీక్షిస్తూ, మృదు మధుర అమృత పూరిత పలుకులతో ఆమె రణోద్రేకాన్ని శాంతింపజేస్తూ ఇలా అన్నాడు “ఓ కాంతా రత్నమా! కాంచితి నీ రణకౌశలము. రాక్షస రాజు సైన్యం మొత్తం ఓడి పాఱిపోయింది. ఇది ఒక గొప్ప విజయం సుమా. అందుకే మెచ్చుకుంటున్నాను. నీకు కావలసిన ఆభరణాలు ఏవైనా సరే కోరుకో ఇచ్చేస్తాను.”

విశేషాంశం:
నరకాసుర వధ ఘట్టంలో శ్రీ కృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, “కొమ్మా” అనే అక్షర ద్వయంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన యిద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. సత్యభామ రణకౌశల ప్రదర్శనకు ముందరి దొకటి వెనుకటి దొకటి వేసిన జంట పద్యాలా అన్నట్లు ఉంటుంది “10.2-172-క. లేమా…” పద్యం. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాట.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=21&Padyam=187

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: