Sunday, February 21, 2021

శ్రీకృష్ణ విజయము - 155

( ప్రద్యుమ్న జన్మంబు ) 

10.2-3-ఉ.
“తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరుకంటిమంటలం
దా మును దగ్ధుఁడై; పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికై,
వేమఱు నిష్ఠఁ జేసి, హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ
కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్.
10.2-4-వ.
అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుం డయ్యె; నా శిశువు సూతికాగృహంబునం దల్లి పొదిఁగిట నుండం, దనకు శత్రుండని యెఱింగి, శంబరుండను రాక్షసుండు దన మాయాబలంబునం గామరూపి యై వచ్చి, కొనిపోయి సముద్రంబులో వైచి, తన గృహంబునకుం జనియె; నంత నా శాబకుండు జలధిజలంబున దిగఁబడ నొడిసి యొక మహామీనంబు మ్రింగె; నందు.
10.2-5-క.
జాలిఁ బడి పాఱు జలచర
జాలంబులఁ బోవనీక, చని రోషాగ్ని
జ్వాలలు నిగుడఁగ, నూరక
జాలంబులు వైచిపట్టు జాలరు లంతన్.

భావము:
విష్ణుదేవుని కుమారుడైన మన్మథుడు పూర్వం పరమేశ్వరుని కంటిమంటలలో కాలిబూడిద అయిపోయి, తరువాత ఈశ్వరుణ్ణి తన దేహం కోసం ప్రార్థించి, రుక్మిణీ కృష్ణులకు, కృష్ణమూర్తి ప్రతిబింబమా అనిపించేలా ఉద్భవించాడు. ఆ బాలుడు “ప్రద్యుమ్నుడు” అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆ శిశువు తనకు శత్రువని తెలిసి, పురిటిగృహంలో తల్లి పొత్తిళ్ళలో ఉండగా శంబరుడనే రాక్షసుడు కామరూపంలో వచ్చి, ఆ బాలుణ్ణి తన మాయా శక్తితో అపహరించుకుని వెళ్ళి, సముద్రంలొ పడవేశి, తన ఇంటికి పోయాడు. ఆ బాలుడు సముద్రజలాలలో పడి మునగుతూ ఉండగా ఒక పెద్ద చేప అమాంతంగా అతణ్ణి మ్రింగివేసింది. జాలరులు వెళ్ళి తమ కోపాగ్ని జ్వాలలు మించగా, సముద్రంలో వలల వేసి బెదిరి పోతున్న జలచరాలను అటునిటు పారిపోనీకుండా పట్టుకుంటున్నారు. వారు ఇంతలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=5

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: