Wednesday, January 22, 2020

దక్ష యాగము - 10


( ఈశ్వర దక్షుల విరోధం )

4-50-తే.
"వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు
వారి కనుకూలు రగుదు రెవ్వారు వారు
నట్టి సచ్ఛాస్త్ర పరిపంథు లైన వారు
నవనిఁ బాషండు లయ్యెద" రని శపించె.
4-51-సీ.
"సకల వర్ణాశ్రమాచార హేతువు, లోక;
మునకు మంగళమార్గమును, సనాత
నముఁ, బూర్వఋషిసమ్మతము, జనార్దనమూల;
మును, నిత్యమును, శుద్ధమును, శివంబు,
నార్యపథానుగం బగు వేదమును విప్ర;
గణము నిందించిన కారణమున
నే శివదీక్ష యందేని మధ్యమ పూజ్యుఁ;
డై భూతపతి దైవ మగుచు నుండు
4-51.1-తే.
నందు మీరలు భస్మజటాస్థిధార
ణములఁ దగి మూఢబుద్ధులు నష్టశౌచు
లై నశింతురు పాషండు లగుచు" ననుచు
శాప మొనరించె నా ద్విజసత్తముండు.


భావము:
ఈ లోకంలో ఎవరు శివదీక్షాపరాయణులో, ఎవరు వారిని అనుసరిస్తారో వారంతా శాస్త్రాలకు విరోధులై పాషండులు అగుదురు గాక! సమస్తమైన వర్ణాశ్రమాచారాలను విధించే వేదం లోకాలకు మేలును కలిగిస్తుంది. అది సనాతనమైనది. దానిని పూర్వ ఋషిపుంగవులంతా అంగీకరించారు. వేదం విష్ణువునుండి ఆవిర్భవించింది. అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది, మంగళప్రదమైనది. దానిని ఆర్యులైనవారు అనుసరిస్తారు. అటువంటి వేదాన్నీ బ్రాహ్మణులనూ నీవు నిందించావు. అందుచేత శివదీక్షను స్వీకరించేవారికి మధ్యమ పూజ్యు డగుగాక! శివవ్రతులు భస్మాన్నీ, జడలనూ, ఎముకలనూ ధరిస్తారు గాక! మూర్ఖులై శుచిత్వం లేనివారై పాషండులై నశింతురు గాక!” అని భృగుమహర్షి శపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=49

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: