Friday, November 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౨(672)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-45-వ.
అనిన విదేహభూపాలుడు “భాగవతధర్మం బెద్ది? యే ప్రకారంబునం బ్రవర్తించు? వారల చిహ్నంబు లెవ్వి? యంతయు నెఱింగింప నీవ యర్హుండ” వనిన నందు హరి యను మహాత్ముం డిట్లనియ.
11-46-తే.
"సర్వభూతమయుండైన సరసిజాక్షుఁ
డతఁడె తన యాత్మయం దుండు ననెడువాఁడు,
శంఖచక్రధరుం డంచుఁ జనెడువాఁడు,
భక్తిభావాభిరతుఁడు వో భాగవతుఁడు.
11-47-క.
వర్ణాశ్రమధర్మంబుల
నిర్ణయకర్మములఁ జెడక నిఖిలజగత్సం
పూర్ణుఁడు హరి యను నాతఁడె
వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా!

భావము:
అని మహాముని కవి చెప్పాడు. అంత, విదేహ రాజు ఇలా అడిగాడు. “భాగవతధర్మ మేది? అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తు లేమిటి? ఇవి చెప్పటానికి మీరే తగినవారు.” దానికి వారిలో హరి అనే మహాముని ఇలా చెప్పసాగాడు:
“భాగవతుడు అంటే ఆ హరి యందు భక్తీ ఆసక్తీ కలవాడు; సర్వభూతమయుడైన పద్మలోచనుడు శంఖం చక్రం దాల్చి తన ఆత్మలో ఉన్నాడనే విశ్వాసం కలవాడు. ఓ మహా రాజా విదేహ! భాగవంతుడు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా, భక్తిమార్గాన్ని ఆశ్రయించి, శ్రీహరి విశ్వం అంతా నిండి ఉన్నాడు అంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=8&Padyam=47

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: