Saturday, November 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౩(673)

( హరిముని సంభాషణ ) 

11-48-వ.
ఇట్లు సర్వసంగపరిత్యక్తుండై, నిఖిలాంతరాత్ముండై, పరమేశ్వరు డరుణగభస్తి కిరణ సహస్రంబుల లోకత్రయంబుం బావనంబు సేయు చందంబునం దన చరణారవింద రజఃపుంజంబు చేతం బవిత్రంబు సేయుచు, సురాసురజేగీయమానసేవ్యం బైన జనార్దన పాదారవిందంబులకు వందనాభిలాషుఁడై, భక్తియు లవమాత్రంబునుం జలింపనీక సుధాకరోదయంబున దివాకరజనితతాపనివారణం బయిన భంగి నారాయణాంఘ్రినఖమణిచంద్రికా నిరస్త హృదయతాపుండై, యాత్మీయభక్తిరశనానుబంధబంధురంబైన వాసుదేవ చరణసరోరుహ ధ్యానానందపరవశుం డగు నతండు భాగవతప్రధానుం” డని యెఱింగించిన విని విదేహుం డిట్లనియె.

భావము:
భాగవతోత్తముడు ఈ విధంగా సకల బంధాలను త్రెంపుకుని అన్నింటిలో పరమాత్మను గుర్తించినవాడై మెలగుతాడు. మహాప్రభువైన సూర్యుడు తన సహస్ర కిరణాలచేత మల్లోకాలనూ పావనం చేయునట్లు, తన పాదధూళి చేత జగత్రయాన్నీ పవిత్రం చేస్తూ ఉంటాడు. దేవదానవులకు కూడా సేవింపదగిన జనార్ధునుని చరణారవిందాలకు నమస్కరించా లనే అభిలాష కలిగి ఉంటాడు. తన భక్తిని రవ్వంత కూడ చలించనీయక చంద్రుడు ఉదయించడంతో ఎండ బాధ పోయినట్లు నారాయణుని చరణకాంతుల వెన్నెలలచే భాగవతుడు హృదయతాపం పోగొట్టుకుంటాడు. ఉత్తమ భాగవతుడు తన భక్తి అనే బంధాలతో వాసుదేవుని చరణపద్మాలకు బంధించుకుని ధ్యానానందంలో పరవశిస్తూ ఉంటాడు.” ఈ విధంగా మహాముని తెలుపగా రాజు విదేహుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=8&Padyam=48

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: