Monday, October 1, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 26

10.1-478-ఉ.
“పడుచులు లేఁగలుం గలసి పైకొని వత్తురు తొల్లి కృష్ణ! మా
కొడుకు లదేల రా; రనుచు గోపిక లెల్లను బల్క నేక్రియన్
నొడివెద? నేఁడు పన్నగము నోరికి వీరికి నొక్కలంకెగా
నొడఁబడ నేలచేసె? విధి యోడక జేయుఁగదయ్య! క్రౌర్యముల్.”
10.1-479-వ.
అని తలపోసి, నిఖిలలోచనుండును, నిజాశ్రిత నిగ్రహమోచనుండు నైన తమ్మికంటి, మింటి తెరువరులు మొఱలిడ రక్కసు లుక్కుమిగుల వెక్కసంబగు నజగరంబయి యున్న య న్నరభోజను కుత్తుకకుం బొత్తుగొని మొత్తంబు వెంటనంటం జని తమ్ము నందఱఁ జిందఱ వందఱ చేసి మ్రింగ నగ్గలించు నజగరంబు కంఠద్వారంబున సమీరంబు వెడలకుండఁ దన శరీరంబుఁ బెంచి గ్రద్ధన మిద్దెచఱచి నట్లుండ.

భావము:
“నేను ఇంటికి వెళ్ళేసరికి గోపికలు ఎదురు వస్తారు. “కృష్ణా! ఇంతవరకూ మా పిల్లలూ లేగదూడలు కలసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు ఇవాళ మా కొడుకులు రారేమిటి? ఏమయ్యారు?” అని అడుగుతారు వారికి నేనేమి జవాబు చెప్పగలను. విధి ఈ రోజు వీరిని గుత్తగుచ్చినట్లు పాము నోటికి అప్పగించింది. ఈ బ్రహ్మదేవుడు ఎప్పుడూ ఇలాంటి క్రూరకృత్యాలే చేస్తాడేమిటో?”
ఇలా భావించిన కృష్ణుడు సర్వమూ చూడగలవాడు; అందరి చూపూ తానే అయిన వాడు; తనను ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడు; తామరరేకుల వంటి కన్నులు కలవాడు కనుక. దేవతలు కూడా మొరలు పెట్టేలాగ, రాక్షసులందరూ గర్వంతో మిడిసిపడేలాగ, ఆ రాక్షసుడు కొండచిలువ రూపంతో బాలకులను లేగదూడలను మ్రింగుతూ ఉంటే కృష్ణుడు కూడా వారివెనుకనే లోపలికి ప్రవేశించాడు. ఆ కొండచిలువ నాలుకలతో అందరిని చిందరవందరచేసి మింగడానికి ప్రయత్నించుతూ ఉంటే; కృష్ణుడు కంఠద్వారం దగ్గర చేరి తన శరీరాన్ని విపరీతంగా పెంచి దిమ్మిస కొట్టినట్లు అక్కడ గొంతుకలో ఇరుక్కున్నాడు. ఇక పాముకు ఊపిరి వెళ్ళే దారి మూసుకు పోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=478

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: