Sunday, October 6, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 9


( కల్కి అవతారము )

12-14-చ.
నరవర! తొంటి భూపతుల నామ గుణంబులు, వృత్తచిహ్నముల్,
సిరియును, రూప సంపదలుఁ, జెన్నగురాజ్యము, లాత్మవిత్తముల్
వరుస నడంగెఁ గాని, యట వారల కీర్తులు నిర్మలంబులై
యురవడి భూమిలో నిలిచి యున్నవి నేఁడును రాజశేఖరా!
12-15-వ.
శంతనుని యనుజండగు దేవాపియు, నిక్ష్వాకువంశజుండగు మరుత్తును, యోగయుక్తులై కలాపగ్రామనిలయులై కలియుగాంతంబున వాసుదేవప్రేరితులై, ప్రజల నాశ్రమాచారంబులు దప్పకుండ నడపుచు, నారాయణస్మరణంబు నిత్యం బొనర్చి, కైవల్యపదప్రాప్తులగుదు; రిక్కరణి నాలుగుయుగంబుల రాజులును నే నెఱింగించిన పూర్వరాజన్యులును, వీరందఱును సమస్తవస్తు సందోహంబుల యందు మమత నొంది యుత్సాహవంతులై యుండి పిదప నీ భూతలంబువదలి నిధనంబు నొందిరి; కావునఁ గాలంబుజాడ యెవ్వరికిం గానరాదు; మత్పూర్వులు హరిధ్యాన పరవశులై దయాసత్యశౌచశమదమాది ప్రశస్తగుణంబులం బ్రసిద్ధు లై నడచి; రట్లు గావున.

భావము:
ఓ రాజోత్తమా! పూర్వరాజుల పేర్లు, గుణాలు, ప్రవర్తనచిహ్నాలు, సిరిసంపదలు, అందచందాలు, రాజ్యాలు, ఐశ్వర్యాలు సర్వం వరుసగా అణగారి పోయాయి. కాని వారి యశస్సులు ఈనాటికి కూడ ఎంతో ఎక్కువగా నిర్మలంగా ధాత్రిలో నిలచి ఉన్నాయి. శంతనుని తమ్ముడు దేవాపి, ఇక్ష్వాకు వంశస్థు డైన మరుత్తు యోగాన్ని అవలంబించి కలాప గ్రామంలో కలియుగాంతం వరకూ ఉంటారు. వారు వాసుదేవుని వలన ప్రేరణ పొందుతారు. ప్రజలు అందరు ఆశ్రమాచారాలు పాటించేలా నడిపిస్తూ నిత్యం నారాయణస్మరణ గావిస్తూ కైవల్యం పొందుతారు. ఈవిధంగా నాలుగు యుగాల రాజులు ఇంతకు ముందు నేను చెప్పిన రాజులు అందరు లోకంలోని సమస్త వస్తువుల మీద మమకారం పెంచుకుని ఉత్సాహంతో జీవితాన్ని గడిపి ఈ భూమండలాన్ని విడిచిపెట్టి మరణం వడిలోకి చేరారు. కాలగమనాన్ని ఎవరు గమనించలేరు. మా పెద్దలు విష్ణుధ్యాన పరాయణులై తమ జీవితాలు గడిపారు. దయా, సత్యం, శౌచం, శమం, దమం మున్నగు సద్గుణాలతో ప్రసిద్ధులై కీర్తిమంతులు అయ్యారు. అందుచేత....

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=15

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

No comments: