Saturday, October 5, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 6


( కల్కి అవతారము )

12-11-వ.
అట్లుగాన జనంబులు లోభులై, జారత్వ చోరత్వాదులచేత ద్రవ్యహీనులై వన్యశాక మూల ఫలంబులు భుజించుచు, వన గిరి దుర్గంబులం గృశీభూతులై దుర్భిక్ష, శీత, వాతాతప, క్షుధా, తాపంబులచేత భయంపడి, ధనహీనులై యల్పాయుష్కులు, నల్పతరశరీరులునై యుండ రాజులు చోరులై సంచరించుచు,నధర్మప్రవర్తనులై వర్ణాశ్రమ ధర్మంబులు విడనాడి, శూద్రప్రాయులై యుండెద; రంత నోషధు లల్పఫలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, సస్యంబులు నిస్సారంబులు నగు; నిట్లు ధర్మమార్గంబు దక్కి యున్నయెడ ముకుందుండు దుష్టనిగ్రహ శిష్టపరిపాలనంబుల కొఱకు శంబల గ్రామంబున విష్ణుయశుం డను విప్రునకుఁ గల్క్యవతారుండై దేవతా బృందంబులు నిరీక్షింప, దేవదత్త ఘోటకారూఢుండై దుష్టమ్లేచ్ఛజనంబులం దన మండలాగ్రంబున ఖండీభూతులం జేయు; నప్పుడు ధాత్రీమండలంబు విగతక్రూరజన మండలంబై తేజరిల్లు; నంత నరులు విష్ణుధ్యాన వందన పూజాది విధానాసక్తులై నారాయణపరాయణు లయి వర్తిల్లెద; రిట్లు కల్క్యవతారంబున నిఖిల జనులు ధన్యు లయ్యెద; రంతటఁ గృతయుగ ధర్మంబయి నడచుచుచుండు; జంద్ర భాస్కర శుక్ర గురువులేక రాశి గతులయినం, గృతయుం బయి తోఁచు; రాజేంద్రా! గత వర్తమాన భావికాలంబులు; భవజ్జన్మంబు మొదలు నందాభిషేక పర్యంతంబుఁ పంచదశాధికశతోత్తర సహస్ర హాయనంబులయి యుండు; నంతట నారాయణుం డఖిల దుష్ట రాజద్వంసంబు గావించి ధర్మంబు నిలిపి వైకుంఠనిలయం డగు;”నని చెప్పిన.

భావము:
అలా కావడంతో ఆ కాలంలోని ప్రజలు దురాశ, వ్యభిచారము, దొంగతనము మున్నగు దుర్గుణాలకు లొంగి, ధనహీనులు అవుతారు. అడవులందు కూరలు, దుంపల, పళ్ళు తింటూ; కొండగుహలలో మెసలుతూ, కృశించి, కరువు కాటకాలకు, చలికి, గాలికి ఎండకు ఆకలికి భయపడిపోతారు. వారి ఆయుర్ధాయం తరిగిపోతుంది. వారి శరీరాలు కూడ చిక్కి చిక్కి చిన్నవైపోతాయి. ఇంక రాజులు తామే దొంగలై తిరుగుతారు. అధర్మంగా సంచరిస్తూ, వర్ణాశ్రమ ధర్మాలను విడచిపెట్టి, శూద్ర సమానులై తిరుగుతారు. ఆ కాలంలో, ఓషధులు ఫలించడం కూడ తగ్గిపోతుంది. మబ్బులు వట్టిపోయి వర్షాలు కురవవు. పండిన పంటలలో పస ఉండదు. ఈ మాదిరిగా లోకం ధర్మమార్గాన్ని తప్పి ఉన్నప్పుడు విష్ణుమూర్తి దుష్టశిక్షణకోసం శంబల గ్రామంలో విష్ణు యశుడనే విప్రుడికి కొడుకు అయి విష్ణుమూర్తి కల్కి పేర అవతారిస్తాడు. దేవతలు అందరూ చూస్తుండగా దేవదత్తం అనే అశ్వాన్ని అధిరోహించి కల్కి భగవానుడు దుష్టులు అయిన మ్లేచ్ఛులను తన కత్తితో తుత్తునియలు చేస్తాడు. అప్పుడు భూమండలం దుష్టజన రహితం కావడంతో, ప్రకాశిస్తుంది. ప్రజలలో విష్ణుభక్తి కుదురుకుంటుంది ధ్యానవందనార్చనాదు లందు ఆసక్తి కలిగి ప్రజలు నారాయణ భక్తిపరాయణులై మెలగుతారు. అలా కల్క్యావతారుని వలన సకల జనులు ధన్యులు అవుతారు. సర్వత్రా కృతయుగ ధర్మమే నడుస్తూ ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశించి నప్పుడు కృతయుగం ఆరంభం అవుతుంది. ఓ పరీక్షిన్మహారాజా! నీవు పుట్టింది మొదలుకొని నందాభిషేకంవరకూ జరిగిన జరుగుతున్న జరుగబోవు కాలం వెయ్యినూటపదిహేను సంవత్సరములు. మిగిలిన కాలాన్ని నువ్వే గణించవచ్చు. ఆ తరువాత నారాయణుడు దుష్టరాజులను అందరినీ సంహరించి, ధర్మాన్ని నిలబెట్టి, మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోతాడు.” అని శుకమహాముని చెప్పాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=11

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

No comments: