Friday, October 11, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 15


( కల్ప ప్రళయ ప్రకారంబు )

12-22-వ.
అనినఁ గల్పప్రళయ ప్రకారం బెట్లనిన నతం డిట్లనియెఁ; “జతుర్యుగ సహస్రంబులు సనిన నది బ్రహ్మకు నొక్క పవలగు; నా క్రమంబున రాత్రియు వర్ధిల్లు; నంత బ్రహ్మకు నొక్కదినం బగుటవలన నది నైమిత్తిక ప్రళయం బనంబడు; నందు విధాత సమస్త లోకంబులం దన యాత్మ యందు నిలిపి శయనింప ప్రకృతి వినష్టంబయిన నది ప్రాకృత ప్రళయం బని చెప్పంబడు; నా ప్రళయ ప్రకారంబు విను; మిట్లు పవలు నైమిత్తిక ప్రళయంబును, రాత్రి ప్రాకృత ప్రళయంబు నగుట గలిగిన, నది యజునకు దినప్రమాణం; బిట్టి దినప్రమాణంబున మున్నూటయఱువది దినంబు లయిన నలువకు నొక్క సంవత్సరంబు పరిపూర్ణం బగుఁ; దద్వత్సరంబులు శతపరిమితంబు లయిన.

భావము:
అప్పుడు పరీక్షుత్తు “కల్ప ప్రళయం ఏ ప్రకారం జరుగుతుంది” అని అడిగాడు. దానికి శుకముని ఇలా అన్నాడు. “ఒకవెయ్యి యుగచతుష్టయాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. అలాగే రాత్రి కూడ ఒకవెయ్యి యుగచతుష్టయాలే. ఇటువంటి రాత్రింబగళ్ళు కలిస్తే బ్రహ్మకు ఒకరోజు అవుతుంది. అందులో పగలు కలుగుదానిని “నైమిత్తిక ప్రళయం” అంటారు. ఆ బ్రహ్మరాత్రి సమయంలో విధాత లోకాలు అన్నింటినీ తనలో చేర్చుకుని నిద్రిస్తాడు. అప్పుడు ప్రకృతి అంతరిస్తుంది దానిని “ప్రాకృత ప్రళయం” అంటారు. ఈ ప్రళయ విషయం వివరిస్తాను విను. పగటిపూట నైమిత్తిక ప్రళయం రాత్రి పూట ప్రాకృత ప్రళయం. ఈ రెండూ కలసి బ్రహ్మదేవునికి ఒక దినము అవుతుంది ఇటువంటివి మూడువందల అరవై అయినప్పుడు బ్రహ్మ కాలమానంలో ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అటువంటివి వంద సంవత్సరాలు అయినప్పుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=5&padyam=22

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

No comments: