Sunday, October 6, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 8


( కల్కి అవతారము )

12-13-వ.
అనిన నట్లగాక, యని చెప్పఁ దొడంగె; “వినుము; సప్తర్షి మండలాంతర్గతంబు లయిన పూర్వ ఋక్షద్వయి సమమధ్యంబు నందు నిశాసమయంబున నొక్క నక్షత్రంబు గానిపించిన కాలంబు మనుష్య మానంబున శతవత్సరపరిమితంబయ్యె నే నా సమయంబున జనార్దనుండు నిజపదంబునఁ బొదలె; నా వేళనె ధాత్రీమండలంబు కలి సమాక్రాంతం బయ్యెఁ; గృష్ణుం డెంతకాలంబు భూమి యందుఁ బ్రవర్తించె, నంత కాలంబునుగలి సమాక్రాంతంబు గాదు; మఘానక్షత్రం బందు సప్తర్షులు నే ఘస్రంబునఁ జరియింతు రా ఘస్రంబునఁ గలి ప్రవేశించి వేయునిన్నూఱు వర్షంబు లయి యుండు; నా ఋషిసంఘంబు పూర్వాషాడ కరిగినం గలి ప్రవృద్ధంబు నొందు; నే దివసంబున హరి పరమపదప్రాప్తుం డయ్యె; నా దివసంబు నంద కలి ప్రవేశించి దివ్యాబ్జసహస్రంబు సనిన యనంతరంబు నాలవ పాదంబునఁ గృతయుగ ధర్మంబు ప్రాప్తం బగు.

భావము:
“సరే అలాగే చెప్తాను, విను” అని శుకముని పరీక్షిత్తు మహారాజుకు ఇలా చెప్పసాగాడు. “సప్తర్షి మండలంలోని పూర్వనక్షత్రాలకు రెండింటికీ సరిగ్గా మధ్య ప్రదేశంలో రాత్రి వేళ ఒక నక్షత్రం కనిపించింది. అది కనిపించాక, మానవ గణన ప్రకారం నూరు సంవత్సరాలు గడిచేక జనార్థనుడైన శ్రీకృష్ణుడు స్వస్థానానికి వెళ్ళిపోయాడు. అవేళనే కలి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు భూమిమీద ఉన్నంత కాలం కలి భూమిమీద అడుగు మోపలేదు. సప్తర్షులు మఘానక్షత్రంలో ప్రవేశించే నాటికి కలి ప్రవేశించి పండ్రెండువందల సంవత్సరాలు అవుతుంది. ఆ సప్తఋషులు పూర్వాషాడలో ప్రవేశించినప్పుడు కలి ప్రవర్ధమానుడు అవుతాడు, శ్రీకృష్ణుడు లోకాన్ని విడచి పరమపదమైన తన లోకాన్ని చేరుకున్న దినముననే కలి ప్రవేశించాడు. ఈ విధంగా వెయ్యి దివ్యసంవత్సరాలు గడిచాక, నాలుగవ పాదంలో కృతయుగ ధర్మం ప్రతిష్ఠితం అవుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=13

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

No comments: