Thursday, October 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౦(660)

( కృష్ణ సందర్శనంబు ) 

11-26-వ.
అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబులే” దని పరమేశ్వరుండు వారలం జూచి “సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబులఁ గలిపి రండు; పొండ”ని జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన, వారు నట్ల చేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన, నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె” నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె.

భావము:
అందుచేత ఈ యతులను నిందించటం అనే దోషం వలన యదువంశం నాశనం కాక తప్పదు.” ఇలా పలికి వాసుదేవుడు వాళ్ళను ఇలా ఆఙ్ఞాపించాడు. “సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ భయంకరమైన బాగా పొడవూ వెడల్పూ గల పెద్దబండ మీద మీ భుజబలాలు వాడి, ఈ ఇనుప రోకలిని బాగా నూరి అరగదీసి పొడి పొడి చేసి, ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలపండి. పొండి.” అన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన ఆ ప్రకారం పొడిచేసి సముద్రంలో కలిపి. మిగిలిన చిన్న లోహపు ముక్కను లెక్క చేయక, అరగదీయుట ఆపి, సముద్రంలో పడవేశారు. దానిని ఒకచేప మ్రింగింది దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్న ఇనుపముక్కను తన బాణం చివర ములికిగా మలచుకున్నాడు.” అని ఆ కథా విషయం అంతా చెప్పిన శుకమహర్షిని పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=26

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: