Friday, October 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౮(648)

( భూభారంబు వాపుట ) 

11-6-మ.
విదితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్పి, దు
ర్మద సంయుక్త వసుంధరాధిపతులన్‌ మర్దించి, కంసాదులం
దుదిముట్టన్‌ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో
యదుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యం బయ్యె నత్యుగ్రమై.
11-7-సీ.
ఈ రీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా-
  శకట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక-
  దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి-
  యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు
ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన-
  నతఁడు భూపాలనం బమరఁ జేసె
11-7.1-తే.
భక్తులగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి
"యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు. "

భావము:
దుర్మదాందులైన రాజులను మర్దించి, కంసుడు మొదలైనవారిని సంహరించి భూమికి బరువును తగ్గించి నందనందనుడు దేవతలందరూ తనను కొలుస్తుండగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా శ్రీకృష్ణుడు మిక్కిలి సంతుష్టితో ఉండగా యదుసైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్థితి వచ్చింది.
ఇలాగ, మహానుభావుడైన శ్రీకృష్ణుడు అతిశయించి; పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను; చాణూర, ముష్టికులను; కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులను సంహరించాడు. అంతేకాక కౌరవసైన్యాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “తన భక్తులైన యాదవులు ఇతరుల వలన ఓటమి లేని వారు. వీరిని సంహరించడానికి నేను తప్ప మరొక దైవం ముల్లోకాల యందు లేడు” అని ఆలోచించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=7

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: